సీఎస్ ను వదలని సైబర్ కేటుగాళ్లు

సిరా న్యూస్,హైదరాబాద్;
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తమకు పనికొచ్చే ఏ ఒక్క మార్గాన్ని వదలట్లేదు. టెక్నాలజీని ఉపయోగించి జనాలను నిలువు దోపడీ చేసేస్తున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాం అనే తేడా లేకుండా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తూ అమాయకుల జీవితాలు నెట్టింట అమ్మకానికి పెట్టేస్తున్నారు. అయితే.. ఈ ఇబ్బందులు సామాన్యులకే కాదు సెలబ్రెటీలు, రాజకీయ నేతలుతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు కూడా తప్పడం లేదు. గతంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు ఐఏఎస్, ఐపీఎస్‌ల ఫోటోలు, పేర్లు వాడుకొని.. బెదిరించి డబ్బు దోచుకున్న ఘటనలు జరిగాయి. తాజాగా అలాంటి ఘటనే.. తెలంగాణ సీఎస్ శాంతికుమారికి ఎదురైంది.తెలంగాణ సీఎస్ శాంతికుమారి తన పేరు, ఫొటోతో.. పలువురికి ఫేక్ కాల్స్ చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. ఈ విషయాన్ని తెలుసుకున్న శాంతికుమారి.. వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. +977-984-4013103 ఫోన్ నెంబర్‌తో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు.. ఇటీవల కొందరికి కాల్స్ చేస్తున్నారని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు శాంతి కుమారి ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఫేక్ కాల్స్ చేస్తున్నవారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సీఎస్ శాంతికుమారి కోరారు. కేసు నమోదు చేసుకున్న టీఎస్‌సీఎస్‌బీ ఫేక్ కాల్స్ చేసినవారిని కనిపెట్టే పనిలో పడ్డారు.గతంలో కూడా అంజనీ కుమార్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారుల ఫొటోలు, పేర్లతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఫేక్ కాల్స్ చేసి.. కొందరిని బెదిరింపులకు పాల్పడ్డ ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కాగా.. ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఒక సీఎస్‌ను కూడా కేటుగాళ్లు వదలకపోవటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వాటిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని.. ఉన్నతాధికారుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇలాంటి ఫేక్ కాల్స్‌ కానీ, సైబర్ నేరగాాళ్ల కదలికలు కానీ గుర్తించినప్పుడు అప్రమత్తంగా ఉండి.. ఎలాంటి వివరాలు ఇవ్వకుండా.. వెంటనే తమను సంప్రదించాలని… పోలీసులు సూచిస్తున్నారు.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *