సిరా న్యూస్,ఖమ్మం;
కూసుమంచి మండలం కేంద్రం లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కార్నర్ మీటింగ్ జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ పదేళ్లు పాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి నోటికొచ్చిన అబద్దాలు మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయని ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రెండు వందల ఉచిత విద్యుత్,ఆరోగ్య శ్రీ, 500 కె గ్యాస్ పథకాలు అమలు చేసాం. రైతులపైన కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంది. మేము వచ్చిన మూడు నెలల్లోనే రైతులకు ఇన్సూరెన్స్ చేయించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల మెస్ బిల్లులు కట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కు మొదటి తారీకునే జీతాలు ఇస్తున్నాం. సిగ్గులేకుండా కరెంటు పోతుందని మాజీ ముఖ్యమంత్రి తన స్థాయిని మర్చిపోయి అబద్దాలు మాట్లాడుతున్నాడని అన్నారు.
గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. రామచంద్రస్వామి సన్నిధిలో పేదలకు ఇళ్ళు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రతి నియోజకవర్గానికి ఐదు వేలు ఇళ్ళు ఇస్తాం, ఇందిరమ్మ ఇంటికి ఎస్సీ,ఎస్టీలకు 6 లక్షలు ఇస్తాం ఈదేశ సంపదను వారికి అనుకూలంగా ఉన్న వారికి దోచిపెడుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపి దేశాన్ని దోపిడీ చేయాలని చూస్తున్నారు. మీరందరూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.