చంద్రబాబుకు కనిపిస్తున్న సింపతి
సిరా న్యూస్,ఏలూరు;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈ ఎన్నికల్లో సానుభూతి ఎక్కువగా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయా? ఏడుపదులు దాటిన వయసులో ఆయనకు ఒక్క అవకాశమిస్తే పోలా? అన్న సింపతీ జనాల్లో వస్తుందా? అంటే కొందరిలో అలాంటి అభిప్రాయమే వినిపిస్తుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. చంద్రబాబు ఇప్పటికే 75 ఏళ్ల వయసు దాటింది. అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండేది ఈ ఒక్కసారి మాత్రమేనని ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తుంది. చంద్రబాబుకు ఈ ఒక్కసారి అవకాశమిస్తే పోయేదేముందన్న ప్రశ్నను కొందరు వేస్తుండటంతో ఆయనకు బాగానే సింపతీ ఉన్నట్లు కనపడుతుంది.ఇందుకు మరో కారణం కూడా ఉంది. జగన్ కు వయసు ఉంది. ఇప్పుడు కాకుంటే మరొకసారి సీఎం అవుతారు. కానీ చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి కాకుంటే ఆయన రాజకీయాల్లో ఉండటం కూడా కష్టమేనన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. పైగా ఆయన తాను ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానని చేసిన శపథం కూడా కొంత పనిచేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా యువత, పట్టణ ప్రాంత ప్రజల్లోనూ, ఎగువ మధ్యతరగతి, ధనికవర్గాల్లో ఎక్కువగా ఈ అభిప్రాయం వ్యక్తమవుతుందని చెబుతున్నారు. పేద వర్గాల్లో ఇంకా అంతటి సానుభూతిని చంద్రబాబు పొందలేకపోయినప్పటికీ ప్రధాన వర్గాల్లో ఆయన పట్ల సాఫ్ట్ కార్నర్ ఏర్పడిందంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం మాట ఎలా ఉన్నప్పటికీ ఎవరైనా వచ్చి మనకు చేసేదేముందన్న నిర్వేదంలో ఓటర్లు చంద్రబాబు వైపు మొగ్గు చూపుతున్నారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కొంత గ్రాఫ్ తగ్గిన మాట వాస్తవమే. అంతకు ముందు జనసేన, టీడీపీ కూటమి పట్ల బాగా ఆకర్షితులయిన వారు బీజేపీతో కలవడంతో కొంత ఆలోచనలో పడినట్లు కూడా చెబుతున్నారు. అయితే ఈ రకమైన సానుభూతి కొన్ని వర్గాల్లోనే ఉండటంతో అది పార్టీ అధికారంలోకి రావడానికి సరిపోతుందా? ఆ తూకం సరిపోదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ కూటమి రూరల్ ప్రాంతంలోనూ, పట్టణాల్లోని పేద వర్గాల్లోనూ కూటమి పట్ల ఏమాత్రం అనుకూలంగా లేదన్నది అనేక సర్వే సంస్థలు కూడా గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. రూరల్ లో బలంగా ఉన్న పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే పట్టణ నియోజకవర్గాలకంటే రూరల్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటు ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకూ గ్రామీణ ప్రాంతంలో టీడీపీ కూటమి ఇంకా బలపడలేదు. గెలుచుకునే స్థాయిలో కనిపించడం లేదన్న వార్తలు వస్తున్నాయి. కానీ చంద్రబాబు పడుతున్న కష్టం చూసి కొందరు గ్రామీణప్రాంతాల్లోనూ ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇస్తే పోలా అన్న అభిప్రాయానికి క్రమంగా వస్తున్నారని చెబుతున్నారు. అది మరింతగా పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక కూటమి పార్టీల నాయకత్వంపై ఉందన్నది వాస్తవం. మరి ఈ పదిహేను రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి ఎటు టర్న్ అవుతుందన్న దానిపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయన్నది వాస్తవమని అంటున్నారు. ఇప్పుడు సింపతీ కౌంట్ అయితే అంత ఈజీ కాదనే …
బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కలిస్తే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని తొలుత భావించారు. కానీ పదేళ్ల నాటి పరిస్థితి వేరు. నేటి పరిస్థితి వేరు. నాడు అంటే 2014లో మోదీ ఫ్రెష్ గా దేశ రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి పోటీ చేయకుండా ఆయన తొలి సారి ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. అందులోనూ కొత్త రాష్ట్రం. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం.. ఇలా అనేక రకాలైన ప్లస్ పాయింట్లు నాడు కూటమిని గెలిపించేలా చేశాయి. కానీ అత్యధిక స్థానాల్లో మాత్రం గెలవలేకపోయింది. 2014 లోనూ 60కి పైగా స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందంటే పెద్ద విజయం కాదనే చెప్పాలి.మోదీని పదేళ్ల పాటు ప్రధాన మంత్రిగా చూశారు. ఆయనపై ఉత్తరభారత దేశంలో పాజిటివ్ లుక్ ఉండవచ్చేమో కానీ, దక్షిణ భారత దేశంలో మాత్రం నెగిటివ్ ను బాగానే మూటగట్టుకున్నారు. ప్రధానంగా మోదీ ఏపీకి అన్యాయం చేశారన్న అభిప్రాయం అధిక శాతం మంది ప్రజల్లో ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలన్న నిర్ణయం, విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాలతో పాటు ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లలో చాలా వరకూ ఆ పార్టీపై వ్యతిరేకత కనపడుతుంది. ఈ కారణాలతో చంద్రబాబుకు బీజేపీతో పొత్తు వల్ల కలసి వచ్చేది లేకపోగా, ఉన్న ఓట్లు పోయే అవకాశాలు స్పష్టంగా చంద్రబాబుకు కనుచూపు మేరలోనే కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా చంద్రబాబు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ పవన్ వైఖరి, ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నది ఆయనకు అందుతున్న నివేదికలను బట్టి అర్థమవుతుంది. ఉభయ గోదావరి జిల్లాలలో తాము ఆశించిన స్థాయిలో స్థానాలు వస్తాయన్న నమ్మకం కూడా ఇప్పుడు లేదంటున్నారు. కాపు సామాజికవర్గం నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు కనిపించకపోవడంతో పవన్ తో పొత్తు వల్ల ప్రత్యేకంగా ఉపయోగం లేకపోయినా చంద్రబాబుకు మాత్రం నష్టం లేదని మాత్రం తెలుసు. ఎంతో కొంత ఓట్లు యాడ్ అవుతాయి కాబట్టి పవన్ తో పొత్తు ఓకే కానీ, బీజేపీతో పొత్తు వల్ల తాము ఈసారి జగన్ ను ఎదుర్కొనడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసింది.