సిరా న్యూస్,హైదరాబాద్;
బిజీగా ఉన్న ప్రాంతాన్ని చూసుకుంటారు. అంతకుముందే అక్కడ రెక్కి నిర్వహిస్తారు. ఎవరైనా అమాయకంగా కనిపిస్తే చాలు.. వెంటనే అతని వద్దకు వెళ్తారు. “అన్నా ఈ దారి ఎటు వెళుతుంది అని అడుగుతారు.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే లోగానే సమయం ఎంతవుతోందనే ప్రశ్న ను సంధిస్తారు. చేతికి ఉన్న వాచి చూసి సమయం చెప్పేలోగానే.. జేబులో ఉన్న సెల్ ఫోన్ చోరీ చేసి పరారవుతారు. పోలీసులకు ఫిర్యాదు చేసేంత సమయం లోనే చోరీ చేసిన ఫోన్ ను నామరూపాలు లేకుండా చేస్తారు. ఇలా చోరీ చేసిన ఫోన్లన్నింటినీ ఇతర దేశాలకు సరఫరా చేస్తారు. చదువుతుంటే భయం కలుగుతున్నది కదూ.. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు కూడా సేమ్ అదే ఫీలింగ్ కలిగింది.మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాదులో సెల్ ఫోన్లు చోరీ చేసి, ఇతర దేశాలకు తరలించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 1.75 కోట్ల విలువైన 703 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.. ఈ నిందితుల్లో కొందరు సూడాన్ దేశానికి చెందినవారు. వీరు మరికొందరితో కలిసి ఒక ముఠాగా మారారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని.. ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా సభ్యులు రాత్రి సమయంలో రోడ్లపై వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ ఫోన్లను చోరీ చేస్తున్నారు. “ఈ టైంలో బస్సు వస్తుందా? ఈ దారి ఎక్కడికి వెళ్తుంది? టైం ఎంత అవుతున్నది? కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? ఫలానా ప్రాంతానికి వెళ్లాలంటే ఈ దారి మీదుగా సాధ్యమవుతుందా” అనే ప్రశ్నలు వేస్తూ.. వారితో మాటలు కలుపుతూ..సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు. అయితే సుడాన్ ముఠా చేతిలో ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు మొత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో పలు పోలీస్ స్టేషన్లలో ఇలాంటి కేసులు ఇటీవల పెరిగిన నేపథ్యంలో.. పోలీసులు దీనిని సవాల్ గా తీసుకున్నారు. చోరీ అవుతున్న సెల్ ఫోన్ల ప్యాట్రన్ ను పోలీసులు జాగ్రత్తగా పరిశీలించారు. దీని వెనుక పెద్ద ముఠా ఉందని గుర్తించారు. దీంతో రాత్రి సమయంలో.. పోలీసులు నిఘా పెట్టారు. అలా 12మంది హైదరాబాద్ వాసులు, ఐదుగురు సూడాన్ దేశానికి చెందిన వారని పోలీసులు అరెస్టు చేశారు.వాస్తవానికి నిందితులు ఒక ముఠాగా ఏర్పడి సెల్ ఫోన్లను చోరీ చేస్తున్నారు. సముద్ర మార్గం ద్వారా సూడాన్ దేశానికి తరలిస్తున్నారు. మరికొన్ని ఫోన్లను జగదీష్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. దెబ్బతిన్న ఫోన్ లను డిస్మాంటిల్ చేస్తున్నారు. అయితే ఈ ఫోన్లను విక్రయించేందుకు హైదరాబాదు జగదీష్ మార్కెట్లో ఓ వ్యక్తి ఏకంగా ఒక కౌంటరే ఏర్పాటు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు తాము చోరీ చేసిన ఫోన్లను ఈ మార్కెట్ కు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఆ ఫోన్లో డేటా మొత్తం తొలగించి.. వాటిని సుడాన్ దేశం తరలిస్తున్నారు. విమాన మార్గంలో తనిఖీలు ఎక్కువ కాబట్టి.. సముద్ర మార్గంలో ఆ దేశానికి పంపిస్తున్నారు. కాగా, పోలీసులు నిందితులను అరెస్టు చేసి 1.75 కోట్ల విలువైన 703 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హైదరాబాదులో మాత్రమేనా? దేశంలో మరో ప్రాంతంలో ఏమైనా చోరీలు చేశారా? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు