ప్రచారానికి డబ్బులు లేవు

పూరి టిక్కెట్ వద్దని కాంగ్రెస్ అభ్యర్ధి
సిరా న్యూస్,భువనేశ్వర్;
ఎన్నికల ప్రచారం అంటే సవాలక్ష ఖర్చులుంటాయి. ఏటా ఈ వ్యయం పెరుగుతూనే ఉంది. అధికారికంగా ఎన్నికల సంఘం ఒక్కో అభ్యర్థి చేయాల్సిన ఖర్చెంతో లెక్కలు చెబుతున్నప్పటికీ…అనధికారికంగా అంత కన్నా ఎక్కువే పెట్టాల్సి వస్తోంది. ఈసీ ఆదేశాల ప్రకారం పెద్ద రాష్ట్రాల్లో ఒక్కో ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో ఒక్కొక్కరూ రూ.75 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. అయితే…క్షేత్రస్థాయిలో మాత్రం ఇంత కన్నా ఎక్కువ ఖర్చు పెడితేనే ప్రచారం కొనసాగుతుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఓ కాంగ్రెస్ అభ్యర్థికి ఇదే జరిగింది. ప్రచారానికి డబ్బుల్లేక ఎంపీ టికెట్‌ని తిరిగి ఇచ్చేశారు. ప్రచారం చేయడం తన వల్ల కాదని తేల్చి చెప్పారు ఒడిశాలోని పూరి ఎంపీ అభ్యర్థి సుచరిత మొహంతి. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీ తనకు నిధులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదని,తన సొంత డబ్బులతో ప్రచారం చేసుకునే స్థోమత లేదని వెల్లడించారు. అందుకే టికెట్‌ని వెనక్కి ఇచ్చేసినట్టు వివరించారు. “పూరి నుంచి పోటీ చేయాలనుకున్నా ప్రచారానికి నా దగ్గర డబ్బుల్లేవు. అందుకే పోటీ చేయలేకపోతున్నాను. చేతిలో చిల్లిగవ్వ లేకుండా క్యాంపెయిన్ చేయడం చాలా కష్టం. అందుకే…నాకు ఇచ్చిన ఎంపీ టికెట్‌ని తిరిగి కాంగ్రెస్ పార్టీకే అప్పగిస్తున్నాను”
– సుచరిత మొహంతి, కాంగ్రెస్ నేత
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *