రేవంత్ ఆరా
సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది. ఈ నిర్మాణం సమీపంలో ఉన్న ఏడుగురు ఈ శిథిలాల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఈ విషాదం జరిగింది. స్థానికంగా ఓ బిల్డింగ్ను నిర్మిస్తున్నారు. అందులో పని చేసేవాళ్ల కోసం ఓ షెడ్ ఏర్పాటు చేశారు. అయితే రాత్రి కురిసిన వర్షానికి ఆ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ సెంట్రింగ్ రాడ్స్ ఒరిగిపోయాయి. దీంతో అవి ఒక్కసారిగా పక్కనే కార్మికులు ఉంటున్న షెడ్పై పడ్డాయి. షెడ్లో ఉన్న వారిపై ఒక్కసారిగా స్లాబ్ సెంట్రింగ్ రాడ్లతో పడినందుకు వాళ్లెవరూ బయటకు రాలేకపోయారు. దీంతో పెను ప్రమాదం జరిగింది. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకున్నాయి. జేసీబీల సాయంతో ఏడు మృతదేహాలను వెలికి తీశాయి. మృత్యువాత పడిన వారంతా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న కూకట్పల్లి ఏసీపి శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. రైజ్ డెవెలపర్స్ కన్స్ట్రక్షన్లో ఈ ప్రమాదం జరిగింది. ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బాచుపల్లి ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడకూలి ఏడుగురు చనిపోవడంపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను సిఎం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాచుపల్లి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.మంగళవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షానికి బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడకూలి ఏకంగా ఏడుగురు కార్మికుల మృతి చెందారు. ఆరిజన్ కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన ప్రాజెక్టు సైట్లో ప్రమాదం జరిగింది. రిటర్నింగ్ వాల్ నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డీసీపీ శ్రీనివాసరావు చెప్పారు. భవన యజమాని అరవింద్రెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు.మృతులందరూ ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. సెంట్రింగ్ పనుల కోసం వచ్చిన కార్మికులు.. కన్స్ట్రక్షన్ సైట్లోనే రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నారు.