ఫలితాల టెన్షన్.. ఉపశమనం కోసం నేతల ట్రిప్పులు

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ముగిశాయి. అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎట్టకేలకు పూర్తయ్యాయి. పోటాపోటీగా సాగిన ఎన్నికల సమరం ముగిసినట్లైంది. ఇక ఓట్ల లెక్కింపు కోసం నేతలు 20 రోజులపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు దశలు పూర్తయ్యాయి. మిగతా మూడు దశలు కూడా పూర్తైన తర్వాత దేశవ్యాప్తంగా జూన్ 4 (మంగళవారం) ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. తెలంగాణలో లెక్కింపు కేంద్రాలలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేయనున్నారు.500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టేబుల్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈవీఎంలతో పాటు 500 పోస్టల్ బ్యాలట్ ఓట్లకు ఒక టేబుల్ను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో పోలైన పోస్టల్ బ్యాలట్లను ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో భద్రపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 44 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్రూంల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతోపాటు సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నారు.ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగాల్సిందే. లోక్సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే టెన్షన్ నుంచి ఉపశమనం కోసం నేతలు జాలీగా ట్రిప్లు ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తెలియాలన్నా జూన్ 1వ తేదీ వరకు ఆగాల్సిన పరిస్థితి నొలకొంది. ప్రచార హడావుడి, మైకుల హోరు, రోడ్షోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలతో హోరెత్తించిన ఫలితాలు వచ్చేలోపు కాస్త సేదతీరేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా కొందరు విదేశాలకు వెళ్లేందుకు పయణమవుతుంటే.. మరికొందరేమో స్వదేశంలోనే పర్యాటక ప్రాంతాలకు కనీసం రెండు, మూడు వారాల పాటు గడపాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఒకటి రెండు వారాలపాటు తమను కలవడానికి కూడా ఎవరూ రావొద్దని ఆదేశిస్తున్నారు. మే 17 నుంచి ఐరోపా పర్యటనకు వెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *