మిషన్ భగీరథ సాంకేతిక లోపాలను సరిదిద్దుకోవాలి
అదనపు నీటిని వన్యప్రాణుల కోసం కేటాయించేందుకు ప్రణాళిక
షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
కమ్మదనం గురుకుల పాఠశాలతో పాటు మిషన్ భగీరథ సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే
సిరా న్యూస్,షాద్ నగర్;
మిషన్ భగీరథ వృధా నీటితో పాటు వర్షాలు పడ్డ సమయంలో వస్తున్న ప్రవాహంతో కమ్మదనం గురుకుల పాఠశాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అలా జరగకుండా ప్రత్యామ్నాయ చర్యలు వెంటనే తీసుకుంటామని షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” స్పష్టం చేశారు. ఫరూక్ నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యాలత తదితర విద్యార్థులు తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే శంకర్ వెంటనే స్పందించారు. మంగళవారం స్థానిక కమ్మదనం గురుకుల పాఠశాలను అలాగే భగీరథ వాటర్ ప్లాంట్ ను సందర్శించారు. మిషన్ భగీరథకు సరఫరా అవుతున్న నీటి విషయంలో సాంకేతిక లోపాలతో నీరు వృధాగా పాఠశాలల్లోకి వస్తుందని ఆ సమయంలో సిబ్బంది ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో నీరంతా గురుకుల పాఠశాలలోకి ప్రవేశిస్తుందని పాఠశాల ప్రిన్సిపల్ విద్యాలత తెలిపారు. అయితే అదే సమయంలో వర్షాలు పడ్డప్పుడు కూడా నీరు పాఠశాలల్లోకి చేరుతుండడంతో పాఠశాల క్రీడా ప్రాంగణంతో పాటు విద్యార్థుల తరగతి గదులలోకి కూడా నీరు చేరుతుందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ వృధా నీరు రాకుండా తమ గురుకుల పాఠశాలలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శంకర్ ను ప్రిన్సిపాల్ విద్యాలత వేడుకున్నారు.