సిరాన్యూస్, ఖానాపూర్
ఖాళీ స్థలాల్లో కంచె ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
పందుల స్థావరం తొలగింపు.. పారిశుధ్యంపై అవగాహన
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్ కాలనీలో జనావాసాల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో బుధవారం ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కంచెను ఏర్పాటు చేయించారు. ఇటీవల పద్మావతి నగర్ కాలనీలో ఓ వ్యక్తి ఖాళీ స్థలాల్లో పందులను పెంచుతున్నాడు. ఈ పందుల వ్యర్ధాలు డ్రైనేజీలో కలవడంతో దుర్వాసన వేదజల్లడంతో కాలనీ వాసులు అనారోగ్యానికి గురవుతున్నారు. కాలనీవాసులు పందులతో పడుతున్నఇబ్బందులను కౌన్సిలర్ పరిమిలత సురేష్ కు తెలియజేశారు. ఈవిషయాన్ని బుధవారం కౌన్సిలర్ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ సంబంధిత మున్సిపాలిటీ అధికారులతో పందుల యజమాని ఇంటి వద్దకు వెళ్లారు. పందుల యజమానిని మందలించారు. పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. పందులను జనవాసాల మధ్యలో పెంచడం సరికాదని, వెంటనే ఇక్కడి నుండి పందులను తొలగించి, ఊరి బయట పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.