సిరాన్యూస్, ఖానాపూర్
రైతుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గుచేటు : బాణావత్ గోవింద్ నాయక్
రైతుల కోసం బీఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాణావత్ గోవింద్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతం కంటే అదనంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, తడిసిన ధాన్యం కూడా కొనాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని అన్నారు . ఈ క్రమంలో బీఆర్ఎస్ ధర్నాలు చేయడం రాజకీయం తప్ప మరోటి కాదన్నారు. సీఎం రేవంత్ రైతు సంక్షేమ సర్కార్ నడిపిస్తున్నదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు . రైతులకు సీఎం రేవంత్ తీపి కబురు చెబుతారని అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చారని, సీఎం రేవంత్ సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారన్నారు. కేసీఆర్ లాగా రైతుల విషయంలో మోసం చేసే సర్కార్ తమది కాదన్నారు. గత 10 ఏళ్లలో రైతులకు బీఆర్ ఎస్ ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు సంకెళ్లు వేసింది బీఆర్ఎస్ కాదా అని నిలదీశారు. వరి వేస్తే ఉరి అని అన్నారని గుర్తు చేశారు .వరి సాగు చెయ్యొద్దని చెప్పి కెసిఆర్ తన ఫామ్ హౌస్ లో వరి వెయ్యలేదా అని నిలదీశారు. ధర్నాల పేరుతో రైతులను మరోసారి మోసం చేసే పనిలో పడ్డారని మండిపడ్డారు. యావత్ దేశంలోనే రైతుల ఆత్మహత్యలో రాష్ట్రాన్ని రెండో స్థానానికి తీసుకొచ్చింది కేసిఆర్ అని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ స్థానాలు దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.