సిరాన్యూస్, ఆదిలాబాద్
బీజేపీ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి
* కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు అన్నపూర్ణ
* ఒకరిపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి
* ఎన్రాల నగేష్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి
ఎదుటివారిని విమర్శించే ముందు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని, తప్పులు ఎత్తిచూపే ముందు తమ తప్పులు లేకుండా చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు అన్నపూర్ణ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా నాయకులతో కలిసి మాట్లాడారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్రాల నగేష్ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. కేఏ పాల్ అంటూ వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడం, అసత్యాలు ప్రచారం చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం వంటివి మానుకోవాలని హెచ్చరించారు. ఎదుటి వారిని విమర్శించే ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఎన్రాల నగేష్ చరిత్ర తమకు తెలుసని, కంది శ్రీనివాసరెడ్డిపై మాట్లాడే అర్హత అతనికి లేదని అన్నారు. మూడుసార్లు పోటీ చేస్తేనే సానుభూతితో పాయల శంకర్ను ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. ఇప్పుడు ఎందుకు ఎన్నుకున్నామా అంటూ బాధపడుతున్నారని అన్నారు. హిందు ధర్మం, దేశభక్తిపై గొప్పులు చెప్పుకునే బీజేపీ నాయకులు ఒక మహిళను పట్టుకుని బొట్టు ఎందుకు పెట్టుకున్నావని ఇటీవల పార్లమెంట్ పోలింగ్ సందర్భంగా ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి అంటూ ఆమె తప్పుబట్టారు. ఇంట్లో ఆడివారితో ఇలాగే మాట్లాడతారా..తోటి మహిళలతో వ్యవహరించి పద్ధతి ఇదేనా అంటూ నిలదీశారు. రాజకీయంలో గెలుపోటములు సహజమని అన్నారు. కేవలం ఒక్కసారి ఓడిపోతేనే కంది శ్రీనివాసరెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, పిచ్చెక్కి కేఏ పాల్గా మారిపోయారని అంటున్నారన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని అన్నారు. అలా అయితే పాయల శంకర్ మూడుసార్లు ఓడారని, మరీ అలాంటప్పుడు ఆయన్ను ఏమనాలని ప్రశ్నించారు. ఒకరిపై దుమ్మెత్తిపోయడం, సోషల్ మీడియా వేదికగా అసభ్య, అనుచిత పోస్టులు పెట్టడం ఎంతమాత్రమూ సరికాదన్నారు. పాయల శంకర్ వ్యవహార శైలి, ఆయన కుమారుడి గుండాగిరి అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ముఖ్యంగా ఎన్రాల నగేష్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఇకముందైనా ఇటువంటి చేష్టలు మానుకోవాలని, లేదంటే మహిళలందరూ కలిసి తగిన బుద్ధిచెబుతామంటూ హెచ్చరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఖబడ్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ మహిళా విభాగం నాయకురాళ్లు డి.శ్రీలేఖ, లత, సోనియా పాల్గొన్నారు.