సిరా న్యూస్,ఉట్నూర్
30వ తేదీ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: అదనపు కలెక్టర్ శ్యామల దేవి
* వరి ధాన్య సేకరణ కేంద్రాలను తనిఖీ
రైతుల నుండి కేంద్రాలకు వచ్చే వరి ధాన్యమును ఈనెల 30 వ తేదీ వరకు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ శ్యామల దేవి నిర్వాహకులకు సూచించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని శాంతినగర్ , బీర్సాయ్ పెట్ వరిధాన్య సేకరణ కేంద్రాలను అదనపు కలెక్టర్ జిల్లా పౌర సరఫరాల అధికారి శోభారాణి డీపీఎం, ఐకేపీ నాయబ్ తహసీల్దార్ లతో కలిసి తనిఖీ చేశారు. బుధవారం కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యమునుపరిశీలించారు. దాదాపు 2 క్వింటాల్ (4 బస్తాల) ధాన్యము తడిసిందని, రైతులు , వరి ధాన్య సేకరణ కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండడం వలన ఎక్కువగా ధాన్యము తడవలేదన్నారు. రైతు, వరి ధాన్య సేకరణ కేంద్రాల నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రము ధాన్యమును రాశులుగా (కుప్ప) పోసి కవర్ లతో ప్యాక్ చేయడం జరుగుతుందని, కుప్పలపై పడిన నీరు బయటకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.తదుపరి మండల స్థాయి గిడ్డంగి, ఉట్నూర్ నందు తనిఖీలు నిర్వహించి బియ్యము నిల్వలు సక్రమముగా ఉంచాలని, నిర్ణిత తేది లోపు చౌక ధరల దుకాణాలకు, అంగన్వాడి సెంటర్లకు , స్కూల్, ప్రభుత్వ వసతి గృహాలకు బియ్యం సరఫరా చేయాలని అన్నారు. అకాల వర్షాల నుండి వరి ధాన్యము తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తగినన్ని టార్పలిన్ లు అందుబాటులో వుండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.