సిరా న్యూస్,ఖానాపూర్
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్
* ఆదివాసీ హత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గురువారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం గత ఐదు నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతాల్లో 120 మందికి పైగా గిరిజనులను బూటకపు ఎన్ కౌంటర్లో హత్య చేసిందని ఈ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గిరిజన మహిళలు పసి పిల్లలను క్రూరంగా కాల్చి చంపింది బిజెపి మోడీ, అమిత్ షా ప్రభుత్వమేనని ఆరోపించారు.
2024 చివరి వరకు దేశంలో మావోయిస్టు పార్టీని, విప్లవ సంస్థలు లేకుండా చేస్తానని ప్రకటించిందన్నారు. గత 58 సంవత్సరాలుగా దేశంలో పాలకవర్గాలు విప్లవ సంస్థల పార్టీలను లేకుండా చేయుటకు బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో వేలాదిమందిని హత్య చేసిందన్నారు. విప్లవ సంస్థలను నిషేధించింది అర్బన్ నక్సలైట్ల పేరుతో ఎన్ఐఏ, యు ఏ పి ఏ, కేసులను పెట్టి జైలుకు పంపిందన్నారు. పాలకవర్గాలు విప్లవ సంస్థల కార్యక్రమాలను శాంతిభద్రతల సమస్యగా చూడడం సరైనదన్నారు.విప్లవ సంస్థల భావాలు, లక్ష్యం ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై పోరాడుతుందన్నారు. ఈ దేశంలో ఆర్థిక అసమానతలు దోపిడీ, పీడనలు ఉన్నంతకాలం విప్లవ సంస్థలు,విప్లవ ఉద్యమాలు ఉంటాయని ఎవరు అంతం చేయలేరని స్పష్టం చేస్తున్నామన్నారు. 16 రాష్ట్రాలలో విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించుటకు బిజెపి ప్రభుత్వం గిరిజనులపై యుద్ధం ప్రకటించిందని. గిరిజనులను అడవి నుండి వెళ్లగొట్టి ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యం ఉందన్నారు. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించలేని బిజెపి మోడీ, అమిత్ షా ప్రభుత్వం సమ సమాజ స్థాపన లక్ష్యంగా పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ విప్లవ సంస్థలపై నిషేధం, నిర్బంధం,బూటకపు ఎన్కౌంటర్లతో హత్యలు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ నాయకులు దుర్గం లింగన్న, గోనె స్వామి, గూట్ల ప్రసాద్, రేగుల గంగన్న, గోగు శేఖర్, మల్లక్క .తదితర నాయకులు పాల్గొన్నారు.