సిరా న్యూస్,ఇచ్చోడ
సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం
* ఇతర రాష్ట్రాలకు పీడీఎస్ బియ్యం
* గుట్టుచప్పుడు కాకుండా తరలింపు
పేదలకందాల్సిన రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణ దర్జాగా కొనసాగుతోంది.అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు పోలీసు అధికారులు అనేక చర్యలు తీసుకున్న రేషన్ బియ్యం మాత్రం అక్రమ రవాణా అగడం లేదు. జిల్లాకు సరిహద్దు పక్కనే మహారాష్ట్ర ఉండడంతో కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని యదేచ్చగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా వాటిని పక్కనే ఉన్న మహారాష్ట్రకు దాటిస్తున్నారు. పేదల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి బయటి మార్కెట్లో అధిక ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు దాడులు జరుపుతున్నా అక్రమాలను అడ్డుకోలేక పోతున్నారు. ప్రభుత్వం చౌక ధరల దుకాణల్లో ఉచితంగా ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని చాలామంది తినడం లేదు. ఇక్కడ కొనుగోలు చేసి బడా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొందరు దళారులు టాటా మ్యక్స్, ఆటోల్లో ఇంటింటికి తిరుగుతూ రేషన్ బి్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా రేషన్ దుకాణాల వద్ద తిష్ట వేసి ఇక్కడ రేషన్ బియ్యాన్ని కొంటున్నారు. లబ్ధిదారుల నుంచి రూ 15 నుంచి 18 రూపాయలకు కొని బడా వ్యాపారులకు 22 రూపాయలకు అమ్మేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.