జోరుగా అక్రమ మట్టి దందా
అధిక లోడుతో రోడ్లు ధ్వంసం
అనుమతులు లేని రవాణా…
ప్రభుత్వ ఆదాయానికి గండి
సిరా న్యూస్,పెద్దపల్లి;
వేసవి కాలం మొదలు కాగానే అక్రమ మార్కుల కన్నులు చెరువు మట్టిపై పడుతాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిందే తడువు ఇక దోపిడీకి తెర లేపడం తరువాయి. ఇక ఇక్కడి నుండి సినిమా మొదలవుతుంది. ఆ ఊరు గ్రామ పంచాయితీ పర్మిషన్ నుండి మొదలు కొని వే బిల్లులు, ఆ పర్మిషన్ ఈ పర్మిషన్ అంటూ ఇటు అధికారుల తిరకాసులతో సదరు కాంట్రాక్టర్ల పరుగులు. ఇక అంతా అయిందనుకునే సమయంలోనే చిన్నా చితిక పెద్ద పత్రికలు, మీడియా చానళ్ళు. మళ్ళీ ఊపిరి పీల్చుకునే సమయంలో పలు సంఘాలు, ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు గద్దల్లా వాలుతారు. అన్ని దులిపేసుకుని మట్టి దందా మొదలు కావడం కొద్ది రోజులు సజావుగా సాగుతుంది. సదరు కాంట్రాక్టర్ ఇక అడ్డు అదుపు లేకుండా 24/7 తన పని తాను కానిస్తుంటాడు. అందరికి సర్దుబాటు జరిగితే అటు వైపు ఏ ఒక్కరు కన్నెత్తి చూడరు. ఎవరికీ తక్కువైనా కాంట్రాక్టర్ కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ఈలోగా కాంట్రాక్టర్ తన పని పూర్తి చేసుకొని దుకాణం మూసుకుంటాడు. కానీ ఇక్కడ తనిఖీ చేయాల్సిన అధికారులు ఎందుకు విధులు సరిగా నిర్వహించడం లేదు. అను మతి ఇచ్చి చేతులు దులుపు కుంటే సరిపోతుందా. నిత్యం వందలాది టిప్పర్లు, లారీలు ఆయా మండలాల నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి ఇటుక బట్టీలకు మట్టి రవాణా జరుగుతున్నా చోద్యం చూస్తున్నారు. ప్రజా ధనం లూటి అవుతున్నా, వేల వేలకు జీతాలు తీసుకొని విధులు సక్రమంగా నిర్వహించని ఇలాంటి అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టర్ నుండి ముడుపులు ముడితే ఒకలా లేకపోతే మరోలా ఉండే అధికారులపై చర్యలు తీనుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న కమాన్ పూర్, రామగిరి మండలాల నుండి ఆయా గ్రామాల మీదుగా చెరువు మట్టిని రాఘవాపూర్ ఇటుక బట్టీలకు టిప్పర్ల ద్వారా బాజాప్తా మట్టిని తరలిస్తున్న కాంట్రాక్టర్ సరైన పత్రాలు లేకుండా నిర్భయంగా తరలించడంలోని ఆంతర్యం ఏమిటి. ఆయా మండలాల అధికారులు ఏమి చేస్తున్నట్లు. గత పదిహేను రోజులుగా ఈ తతంగం సాగుతున్నదని పలువురు ప్రజలు పేర్కొంటున్నారు. నిత్యం మంథని – పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తనిఖీల పేరుతో తిరిగే జిల్లా స్థాయి అధికారులకు కూడా కనిపించడం లేదా అంటూ పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పుతో హడావుడి చేస్తున్న అధికారులు తమ భాద్యతలు ఇప్పటి వరకు ఎందుకు మరిచినట్లు. కోర్టు చెపితే గానీ భాద్యతలు గుర్తుకు రావా అంటున్నారు ఆయా స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు. ఇది కూడా ప్రజల పిర్యాదు చేస్తే కానీ అధికారులు స్పందించాల్సి రావడం దురదృష్టకరం. నిత్యం జరుగుతున్న ఇలాంటి దోపిడీని అరికట్టేందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
=======================