సిరా న్యూస్,విజయవాడ;
ఎన్నికలు ముగిసి రోజులు గడుస్తున్నాయి. ఫలితాలు కూడా త్వరలోనే రానున్నాయి. మరి ఫలితాలపై తెలుగు తమ్ముళ్ల మౌనం ఎందుకు? అధినేత నుంచి కింది స్థాయి నాయకుల వరకు నోరు మెదపకపోవడం వెనుక కారణం ఏంటి.? మౌనం గెలుపునకు అంగీకారమా.? లేక పార్టీ స్ట్రాటజీలో భాగమా.? అసలేం జరుగుతందో తెలియక పసుపు నేతలు డైలమాలో పడిపోయారట. తెలుగుదేశం పార్టీ కేడర్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైందట. పోలింగ్ జరిగి అప్పుడే రెండు వారాలు గడిచినా.. పార్టీ నేతల్లో ఒకప్పటి ఉత్సాహం కనబడటం లేదట. దీనికి కారణం ఏంటో తెలియక పసుపు పార్టీ కార్యకర్తలు తెగ మదన పడిపోతున్నారు. ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఫలితాల విషయంలో ఆ పార్టీ నేతలెవరూ స్పందించకపోవడం వెనుక అసలు కారణం ఏంటా అని ఆందోళనలో ఉన్నారట. పోలింగ్కు ముందు వరకూ తామే అధికారంలోకి వస్తున్నామంటూ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలు కూడా తెగ ఊదరగొట్టేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఇంకేముంది అధికారంలోకి వచ్చేశాం అనే విధంగా మాట్లాడేవారు. అలాంటిది ఇన్ని రోజులుగా మౌనం వహించడం వెనుక వ్యూహమా లేక ఇంకేదైనా కారణం ఉందా అని చర్చించుకుంటున్నారు..గతంలో ఎన్నికలు జరిగిన రోజు లేదా ఆ మర్నాడు పార్టీ అధినేత చంద్రబాబు మీడియా ముందుకొచ్చేవారు. ఫలితాలు ఎలా వస్తాయనేది ఊహిస్తూ తమ గెలుపుపై కామెంట్స్ చేసేవారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు చిన్నమాట కూడా మాట్లాడలేదు. ప్రధాని మోడీ నామినేషన్ సమయంలో వారణాసి వెళ్లినప్పుడు మాత్రమే ఓ ఇంగ్లీష్ చానల్తో మాట్లాడారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పారు. అది మినహా ఇంకెక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆ తర్వాత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. ఇక నారా లోకేష్, అచ్చెన్నాయుడు లాంటి వారు కూడా గెలుపుపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇక పార్టీలో ఉన్న ఇద్దరుముగ్గురు నేతలు మాత్రం రాష్ట్రంలో జరగుతున్న రోజువారీ పరిణామాలపై ఈసీని లేదా డీజీపీని కలిసి ఫిర్యాదులు చేయడం మినహా ప్రభుత్వం ఏర్పాటుపై చిన్నమాట కూడా మాట్లాడటం లేదుఎన్నికల ఫలితాలపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపుపై ధీమాగా ముందుకెళ్తున్నారు.