కార్పొరేట్ స్కూల్ లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలి.

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. బుధవారం
భూపాలపల్లి మండలంలోని ప్రాధమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి గ్రామీణ ప్రాంతాల్లో 22 పాఠశాలల్లో 160.29.లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పన పనులను చేపట్టినట్లు తెలిపారు. పెద్దాపూర్ లో 12.25 లక్షల, నేరేడుపల్లి లో 15.27 లక్షలు వజినేపల్లి 4.87 లక్షలు, రాంపూర్ లో 6 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులు పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పనకు నిధులు వెచ్చించి ప్రభుత్వ బడులలో మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలు పున ప్రారంభం నాటికి ఏ ఒక్క పని పెండింగ్ లేకుండా సంపూర్ణంగా పూర్తి చేసి ఆహ్లదకరంగా తయారు చేయాలని అన్నారు. బడులు బాగుచేసుకోవడంతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీరు, విద్యుత్, మరుగుదొడ్లు, విద్యార్థులు భోజనం తదుపరి చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ ప్లాట్ ఫారం ఉండాలని పేర్కొన్నారు. మనమే విద్యార్థులమైతే ఎలాంటి సౌకర్యాలు ఉంటే బావుంటుందని కోరుకుంటామో అదే స్థాయిలో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం, కనీస సౌకర్యాలు, నాణ్యమైన విద్యను అందించాలని ఆయన సూచించారు. ఖర్చుకు వెనకాడకుండా జిల్లాలో మరమ్మత్తులు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకుమెరుగైన నాణ్యమైన విద్యను అంధించేందు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన పనులు చురుకుగా జరుగుతున్నాయని అన్నారు. పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. నిధులు కొరత రాకుండా పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు మహిళా సంఘాలకు అంచనా ప్రతిపాదనలు మేరకు 25 శాతం ముందస్తు నిధులు మంజూరు చేశామని అన్నారు. పూర్తి అయిన పనులకు ఎలాంటి జాప్యం లేకుండా బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. చేపట్టిన పనులకు చెల్లించిన ప్రతి రూపాయి లెక్క పక్కాగా ఉండాలని, అందుకు రిజిస్టర్లులో నమోదులు చేయాలన్నారు. మరమ్మతులు చేపట్టకు ముందు, పనులు జరుగుతున్నపుడు, పనులు పూర్తి అయిన తదుపరి మూడు దశల ఫోటోలు భద్రపరచాలని తెలిపారు. పాఠశాలల మైదానాలు ఎత్తు, పల్లాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచేందుకు ఉపాధి హామీ పధకం నిధులు ద్వారా చదను చేయాలని అన్నారు. నీళ్లు నిలిచే అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
స్థలం ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.ఈకార్యక్రమంలో పంచాయతి రాజ్ డి ఈ వెంకటేశ్వర్లు, ఏఈ సురేష్ కుమార్, ఎంపిఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *