సిరాన్యూస్, ఆదిలాబాద్
విత్తన దుకాణాలను పరిశీలించిన ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం
* నకిలీ విత్తనాలు అరికట్టేందుకే ప్రత్యేక బృందాలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ అంబేద్కర్ చౌక్ మధ్యలో గల విత్తనాల షాపులను బుధవారం జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పరిశీలించారు. ఈ సందర్భంగా యజమానులతో విత్తనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఒకే రకం విత్తనాలను కోరుకోవడం వల్ల డిమాండ్ పెరిగిపోయిందని తెలియజేశారు. దానివల్లనే షాపుల వద్ద క్యూ లైన్లను ఏర్పాటు చేయడంలో పోలీసుల బందోబస్తు ను వేయడం జరిగిందని తెలిపారు. అన్ని షాపుల వద్ద సరైన క్రమబద్దీకరణతో కూడిన వరుసక్రమాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రశాంతంగా రైతులు సంయమనం పాటిస్తూ వరుసక్రమాలలో విత్తనాలను షాపుల వద్ద నుండి తీసుకోవాలని సూచించారు. పోలీసులు తమ క్షేమం కోసమే విధులను నిర్వర్తిస్తుంటారనే విషయాన్ని గమనించాలని కోరారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అడ్డుకట్టకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే ఆకస్మిక తనిఖీలను నిర్వర్తిస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో భారీ ఎత్తున దాదాపు 500 కిలోల 19 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పి ఆదిలాబాద్ ఎల్ జీవన్ రెడ్డి, ఒకటవ పట్టణ సీఐ కే సత్యనారాయణ ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.