సిరాన్యూస్ , భీమదేవరపల్లి
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును తరలిస్తే నిరాహార దీక్ష
* తెలంగాణ అంబేద్కర్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చునూరి కరుణాకర్
* మహిళా అధికారిపై లేనిపోని ఆరోపణలు తగదు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును వ్యక్తిగత కక్ష సాధింపు కోసం అనవసర రాద్ధాంతం చేస్తే ఊరుకోబోమని తెలంగాణ అంబేడ్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పర్చునూరి కరుణాకర్ హెచ్చరించారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా భీమదేవరపల్లి తాలూకా ఏర్పడినప్పటి నుండి కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నాలుగు మండలాలకు సేవలు అందుతున్నాయన్నారు. ఐదారుగురు వ్యక్తులు ఆఫీస్ వద్ద డాక్యుమెంట్లు తయారు చేసే రైటర్ల నుండి డబ్బులు వసూలుకు ప్రయత్నం చేస్తే వారు ఇవ్వనందుకు ఆఫీసునే ఇక్కడనుండి లేకుండా చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక మహిళ సీనియర్ సబ్ రిజిస్ట్రార్ పైన ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. వారి ఆగడాలకు తట్టుకోలేక ఆ మహిళా అధికారి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం జరిగిందన్నారు. వ్యక్తులను టార్గెట్ చేసి ప్రజోపకరమైన ఆఫీసులపై అనవసర ఆరోపణలు చేయవద్దని హితవు పలికారు. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసును తరలించే ప్రయత్నం చేస్తే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. మండల కేంద్రంలో గత బిఅర్ఎస్ ప్రభుత్వ హయాంలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు శంకుస్థాపన చేశారన్నారు. ఏండ్లు గడిచిన భవనం పిల్లర్ల దశలోనే నిలిచిపోయిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చొరవ తీసుకుని నిలిచిపోయిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో దళిత నాయకులు చాగంటి వెంకటేశ్వర్లు, ఎలకపల్లి శ్రీనివాస్, ఎలకపల్లి ఆనందం, రాకేష్, లింగం కృష్ణ , కుమారస్వామి, రమేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.