ప్రభుత్వ విద్యా సంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులదే.

ప్రభుత్వ విద్యాసంస్థలు మూతబాటు కు కారణం ప్రభుత్వ వైఫల్యమే .

ఆర్థిక అసమానతలు పోవాలంటే ప్రభుత్వ బడులు నిలబడాలి

.ప్రభుత్వ విద్యా రంగంపై తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత టీచర్లతో పాటు అందరిదీ

.ప్రపంచంలో విద్యను ఏ దేశం వ్యాపార మయం చెయ్యలేదు.భారతదేశంలో తప్పా

.ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు తెలంగాణ పౌర స్పందన వేదిక కృషి.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
సిరా న్యూస్,సూర్యాపేట జిల్లా;
విద్యార్థుల నమోదు లేక మూతపడే స్థితికి వస్తున్న ప్రభుత్వ విద్యా సంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజా ప్రతినిధులదే, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో తెలంగాణ పౌరస్ స్పందన వేదిక కోదాడ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులు నిలబడాలి,చదువుల్లో అంతరాలు పోవాలి అనే అంశంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. గత పది ఏళ్లలో ప్రభుత్వ వైఫల్యంతో ప్రభుత్వ విద్యా రంగం సంక్షోభంలోకి నెట్టివేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాల ల్లో కళాశాల ల్లో స్కావెంజర్లు నియామకం చేయకపోవడం అత్యంత దారుణం అన్నారు .జిల్లా కలెక్టరేట్ సెక్రటేరియట్ లో కూడా ఉడిచే వారి తాళం వేసేవారు లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి గుర్తు చేశారు. పాఠశాలలలో స్కావెంజర్ లేక ఉపాధ్యాయులే పాఠశాలలను శుభ్రం చేస్తున్నారని, ప్రధానోపాధ్యాయులే తాళం తీయడం వేయడం పనులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్కావెంజర్లను నియామకం చేయాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను మార్చాలన్నారు. పాలకవర్గాల విధానాలతోనే ప్రైవేటు విద్యారంగం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతుందని ఆర్థిక అంతరాలు పోవాలంటే ప్రభుత్వ బడులు నిలబడాలన్నారు .ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల తో పాటు ఉద్యోగులు ,ప్రజా ప్రతినిధులు ,తమ పిల్లలను చేర్పించాలన్నారు. ప్రభుత్వ విద్యా రంగంపై తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉందని తల్లిదండ్రులకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పిల్లలు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండాలని ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని ప్రధానోపాధ్యాయుడిని నియామకం చేయాలని డిమాండ్ చేశారు .బడి అంటే ఒక ఉపాధ్యాయులదే బాధ్యత కాదని ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు బాధ్యతగా తీసుకొని పాఠశాలలకు వసతులతో పాటు విద్యార్థుల నమోదుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలన్నారు. ప్రపంచంలో భారత్ దేశం తప్ప ఏ దేశం విద్యారంగాన్ని వ్యాపారమయం చేయలేదని ఆరోపించారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో విద్య అత్యంత వ్యాపారమయంగా మారిందన్నారు .ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడకపోతే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ బడి లేని రాష్ట్రంగా మారి చరిత్రలో నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉపాధ్యాయులు కూడా ఒక పౌరునిగా ఆలోచించి ప్రజా చైతన్యం ద్వారా ప్రభుత్వ విద్య రంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చే పాఠశాల గ్రాంటు పాఠశాల ప్రారంభంలోనే సమకూర్చోలన్నారు. బడిబాటలో అందరూ భాగస్వాములై ప్రభుత్వ బడిని నిలపాలన్నారు. ప్రభుత్వ బడులు నిలబడాలని చదువుల్లో అంతరాలు పోవాలని అప్పుడే రాజ్యాంగం లో ఉన్న విధంగా ఆర్థిక అసమానతలు తగ్గుతాయన్నారు .ప్రభుత్వ విద్యాసంస్థలు పాఠశాలలు కళాశాలల పరిరక్షణకు విద్యా వైద్యం ప్రభుత్వ బాధ్యత అనే నినాదం తో తెలంగాణ పౌర స్పందన వేదిక అందరినీ భాగస్వాములు చేసి కృషి చేస్తుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కేఏ మంగా, జిల్లా అధ్యక్షులు ఆర్ ధనమూర్తి ,కోదాడ ప్రాంతీయ అధ్యక్షులు వెంకటరమణ, టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, టి ఏ పి ఆర్ పి ఏ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి, యుటిఎఫ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *