కూటమికి ప్లస్ …అదే

సిరా న్యూస్,కాకినాడ;
టిడిపి కూటమికి సాలిడ్ గెలుపు లభించింది. అటు వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా ఓటమి తలుపు తట్టింది. ఈ తరహా ఓటమిని వైసిపి అంచనా వేయలేకపోయింది. అదే స్థాయిలో భారీ స్థాయిలో గెలుపును ఊహించలేకపోయింది టిడిపి కూటమి. అయితే ఒకరిది ఓవర్ కాన్ఫిడెన్స్. మరొకరిది సమిష్టి విజయం. కూటమి ప్రతి అడుగు పక్కాగా వేయగా.. వైసీపీని మాత్రం అతి ధీమా కొంపముంచింది. కోలుకోలేని దెబ్బతీసింది. కనీవిని ఎరుగని ఓటమి ఎదురైంది. అయితే ఇది వైసీపీ స్వయంకృతాపమే.ప్రజల్లో నివురు గప్పిన అసంతృప్తిని పసిగట్టడంలో వైసిపి విఫలం అయ్యింది. పెద్ద ఎత్తున ఓటింగ్ పెరగడం కూడా వైసీపీకి మైనస్ గా మారింది. కానీ అదంతా తమ పాజిటివ్ ఓటు బ్యాంకు అని వైసిపి నమ్మింది. సంక్షేమ పథకాలు అందుతుండడంతో ప్రజల్లో సంతృప్తి శాతం ఉంటుందని వైసీపీ భావించింది. కానీ ప్రజల్లో ఉన్న అసంతృప్తి జ్వాలలను తెలుసుకోలేక పోయింది. అభివృద్ధి విషయంలో అస్సలు పట్టించుకోలేదు. ముందుగా సంక్షేమం అన్నట్టు వ్యవహరించింది. కొత్త పరిశ్రమల రాక, ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించకపోవడం, చాలా పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం కూడా మైనస్ గా మారింది. ఒక్క సంక్షేమ పథకాలు ఆదుకుంటాయన్న ఆలోచన సైతం ఫెయిల్ అయ్యింది.ఇక తెలుగుదేశం పార్టీకి అన్ని శకునాలుగా పని చేశాయి. అన్ని అంశాలు కలిసి వచ్చాయి. ముఖ్యంగా కూటమి ఏర్పాటుతో పరిస్థితి మారిపోయింది. మూడు పార్టీల మధ్య సమన్వయం చక్కగా కుదిరింది. అన్నింటికీ మించి బిజెపిని ఒప్పించడం కలిసి వచ్చింది. అటు నందమూరి, ఇటు మెగా ఫ్యామిలీ కూటమికి అండగా నిలిచింది. చిరంజీవితో ప్రత్యేక ప్రకటన, సినీ పరిశ్రమ నుంచి మద్దతు కలిసి వచ్చాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకోని వరంగా మారింది. ఆస్తులకు సంబంధించి ధ్రువపత్రాలపై జగన్ ఫోటోను ఎక్కువమంది వ్యతిరేకించారు. అది భూములు లాక్కునేందుకు చేసిన యాక్ట్ అంటూ విపక్షాలు చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అంతకుముందే చంద్రబాబు అరెస్టుతో ఒక రకమైన సానుభూతి ప్రజల నుంచి వ్యక్తమైంది. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు అరెస్టు చేశారని, ఏడుపదుల వయసులో ఆయనకు సుదీర్ఘకాలం జైలులో పెట్టడం, అందుకు సహేతుకమైన కారణాలు చూపకపోవడం కూడా మైనస్ గా మారింది. కూటమికి ప్లస్ గా మారాయి.
మరో వైపు అతివిశ్వాసం
సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు 151 సీట్లు ఇచ్చి పాలించు నాయకా బాధ్యతలు అప్పగించారు. కానీ ఈ అద్భుతమైన అవకాశాన్ని అతడు తన చేతులారా నాశనం చేసుకున్నాడు.. ప్రజా అనుకూల ఓటును వ్యతిరేక ఓటుగా మార్చుకున్నాడు.. అప్పటిదాకా ఏపీ ప్రజలు చంద్రబాబు పాలన చూశారు. అతని పరిపాలన విధానాలు ఏమిటో ఏపీ ప్రజలకు కొత్త కాదు. చంద్రబాబును పక్కన పెట్టినట్టే పవన్ కళ్యాణ్ ను కూడా ఓడించారు. వాస్తవానికి చంద్రబాబులో మార్పు వస్తుందని ఆశించడం పెద్ద పొరపాటు. పైగా అతడు మారే మనిషి కూడా కాదు. ఇక బిజెపి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాల్టికి దానికి ఓ దిశా దశ అంటూ లేదు. పైగా ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడం కూడా కూటమికి చేతకాలేదు. అక్కడి దాకా ఎందుకు చాలా చోట్లల్లో అభ్యర్థులు లేకపోతే.. టిడిపి సమకూర్చాల్సి వచ్చింది..ఇంతటి దుస్థితిలోనూ ఏపీ ప్రజలు కూటమికి జై కొట్టారు. బ్రహ్మరథం పట్టారు.. చంద్రబాబు పరిపాలనకు ఏపీ ప్రజలు దాసోహం అయ్యారు అంటూ టిడిపి మీడియా భజన చేస్తుంది కానీ.. ఏపీ ప్రజలకు వేరే ప్రత్యామ్నయం లేదు. గుడ్డి కన్నా మెల్ల నయం అన్నట్టుగా.. జగన్ కంటే ఆ చంద్రబాబు కాస్త నయం అని ఏపీ ప్రజలు అనుకున్నారు. అందువల్లే కూటమిని గెలిపించారు. అంతే తప్ప ఇందులో ఓటరు ప్రేమ, అనురాగం, ఆవకాయ బద్ద వంటివి లేవు.ఆంధ్ర ప్రజలు ప్రతిసారి తమ గుంబన తత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ అటూ ఇటూ కాని తీర్పు చెప్పలేదు, చెప్పరు కూడా. 2019, 2024 ఎన్నికలలో ఏకపక్షంగా తీర్పు ఇవ్వడమే అసలు సిసలైన వైచిత్రి. వాస్తవానికి గత ఎన్నికల్లో వచ్చిన బంపర్ మెజారిటీని జగన్ మరింత అనుకూలంగా మలచుకుంటే.. ఈ ఎన్నికల్లో తిరుగులేని విధంగా అధికారంలోకి వచ్చేవాడు. వందల మందిని సలహాదారులుగా పెట్టుకున్నాడు, వందలాది కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు ఇచ్చాడు.. అందులో కొంతమంది పెత్తందారులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ ఉపయోగపడలేదు. ఈ ఐదేళ్లలో ఇదీ నేను చేసింది అని చెప్పుకోవడానికి జగన్ కు ఏదీ లేదు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానానికి పరిమితమైనప్పటికీ కెసిఆర్ తన హయాంలో నిర్మించిన సెక్రటేరియట్ ను దర్జాగా ప్రదర్శించగలడు. నరేంద్ర మోడీ అయోధ్య రామాలయాన్ని చూపగలడు. అలాంటి అవకాశం వచ్చినప్పటికీ జగన్ వదులుకున్నాడు.రీ – టెండరింగ్ పేరుతో పోలవరాన్ని పడుకోబెట్టాడు. కమ్మరావతి అని ప్రచారం చేస్తూ.. పిచ్చి తుగ్లక్ లాగా మూడు రాజధానుల పల్లవి ఎత్తుకున్నాడు. పంచుడు పథకాలు మాత్రమే గెలిపిస్తాయని భ్రమలో జీవించాడు. చివరికి గుంతలు పడిన రోడ్లను కూడా బాగు చేయలేకపోయాడు. ఎస్సీ, ఎస్టీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించాడు. అనంత బాబు లాంటి వారిని వెనుకేసుకొచ్చాడు.. ప్రజలకు అందుబాటులో ఉండకపోగా.. చివరికి సొంత పార్టీ నాయకులకు కూడా దొరకలేదు. ప్రత్యేక హోదా డిమాండ్ ను అటక మీద పెట్టాడు. ఇంత జరుగుతుంటే ఎల్లో మీడియా చూస్తూ ఊరుకోదు కదా.. టన్నులకొద్దీ నెగెటివిటీని ప్రచారం చేసింది. వారికి షర్మిల కూడా తోడైంది. ఉద్ధరిస్తుందని దగ్గర పెట్టుకుంటే ఐపాక్ డబ్బులు తీసుకుని గాని.. పనికిమాలిన పనులు చేసింది. అంతిమంగా ఆ ఎఫెక్ట్ జగన్ మీద పడింది. అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దూరం కావడంతో.. జగన్ ఏం చేస్తాడనేదే ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *