గులాబీకి పార్లమెంట్ లో లేని ప్రాతినిధ్యం

సిరా న్యూస్,హైదరాబాద్;

ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయనే సామెత సమకాలీన రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితికి సరిగ్గా సరిపోతుందని చెప్పాలి. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి పార్లమెంట్‌ ఎన్నికలకు కేసీఆర్‌ కుటుంబం దూరంగా ఉండటం బీఆర్‌ఎస్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం మరో దెబ్బ. 2014 నుంచి 2023 నవంబర్‌ వరకు దాదాపు పదేళ్లు తెలంగాణ అధికార పార్టీగా చక్రం తిప్పిన బీఆర్‌ఎస్‌కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాన్ని అందించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ పార్టీని వీడటం బీఆర్‌ఎస్‌ను మరింత దెబ్బకొట్టింది. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవలేకపోవడం ఊహించని పరిణామమే. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి.ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరూ లోక్‌సభ బరిలో నిలబడలేదు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి కేసీఆర్‌ ఎంపీగా గెలిచారు. అప్పటి యూపీఏ సర్కారులో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006, 2008లో జరిగిన కరీంనగర్‌ పార్లమెంట్‌ ఉపఎన్నికలో ఆయన విజయం సాధించారు. 2009లో ఆయన మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించడంతో కేసీఆర్‌ సీఎం అయ్యారు. ఆ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి కేసీఆర్‌ కుమార్తె కవిత ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. అలాగే కేసీఆర్‌ కుటుంబం నుంచి ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయలేదు.వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలు చాలా మంది విముఖత చూపారు. టికెట్‌ ప్రకటించిన తర్వాత చాలా మంది పార్టీ ఫిరాయించారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సాధించిన విజయంతో బీఆర్ఎస్ అగ్ర నేతలు తామేదో అద్భుత విజయం సాధించామని ఇదే విజయ పరంపర ఇకపై కొనసాగుతుందని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. అక్కడ అనుకూలించే అంశాలు వేరేరకంగా ఉంటాయి. అయితే రీసెంట్ ఎగ్జిట్ పోల్స్ అంశాలు , ప్రస్తుత ఓటింగ్ సరళి పరిశీలిస్తే బీఆర్ఎస్ కు అనుకూలంగా లేవని అర్థం అవుతోంది. దాదాపు 12 సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలు పరిశీలిస్తే బీఆర్ఎస్ పతనం దిశగా అడుగులు పడుతున్నట్లే కనిపిస్తోంది. పార్లమెంట్ ఫలితాల సరళి కూడా అలానే ఉంది. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు పతనం తప్పదని రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు. మరికొందరైతే ఫలితాల తర్వాత మళ్లీ కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితం అవుతారని జోస్యం చెబుతున్నారు.పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పతనం అంచున పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదా అయినా దక్కించుకున్న గులాబీ పార్టీ పార్లమెంట్ ఫలితాలు వచ్చే నాటికి కేవలం సింగిల్ డిజిట్ లేక సున్నా స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా గంపగుత్తగా బీఆర్ఎస్ పరిస్థితి దాదాపు ఇంతే అన్నట్లుగా అంచనా వేశాయి. ఎమ్మెల్సీ విజయం చూపించి కార్యకర్తలలో ఆత్మస్థయిర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనేతలు. నేటి ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటని బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ఇతర పార్టీలకు వలస వెళ్లిన నేతలతో సహా కొత్తగా మరింతమంది పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని రకాల గాంభీర్యపు ప్రకటనలైనా చేయవచ్చు గానీ, ఈ ఎన్నికల ఫలితాల సరళి మాత్రం కేసిఆర్ దళం పతనాన్ని స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. 12 సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలలో.. ముగ్గురు భారత రాష్ట్ర సమితికి కేవలం సున్న స్థానాలు మాత్రమే దక్కుతాయని అంచనా వేశారు! అదే సమయంలో మరో నాలుగు సంస్థలు సున్న నుంచి ఒక్క స్థానం దక్కే అవకాశం ఉన్నదని చెప్పుకొచ్చాయి. ఒక సంస్థ నుంచి మూడు స్థానాలు దక్కుతాయని అంచనా వేస్తుండగా, మరో ఇద్దరు రెండు స్థానాలు గెలుస్తారని, ఒకే ఒక్క సంస్థ న్యూస్ 18 మాత్రం రెండు నుంచి ఐదు స్థానాలలో భారత రాష్ట్ర సమితి విజయం సాధిస్తుందని అంచనావేయడం జరిగింది. అయితే వీటన్నింటికీ భిన్నంగా అస్సలు ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ పోటీ ఇవ్వలేక మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉండబోతున్నదని ముందే అర్థమైంది ఆ పార్టీ ఎంపీలు పలువురు భారతీయ జనతా పార్టీ కాంగ్రెసులలో చేరిపోయారు. అలాగే టికెట్లు కేటాయించే సీజన్ వచ్చిన తర్వాత ఎంపీ టికెట్లు ఇస్తామంటే పలువురు సీనియర్ నాయకులు మాకు వద్దంటే వద్దంటూ తిరస్కరించారు. ఎంపీగా పోటీ చేసే ఉద్దేశం లేదని అన్నారు. కొందరైతే టికెట్ ప్రకటించిన తర్వాత కూడా మాకు వద్దని తిరస్కరించారు. ఒకవైపు కేసీఆర్ పిలిచి మరీ టికెట్ ఇస్తానని అన్నప్పటికీ పుచ్చుకోకుండా వద్దని అన్నవారు.. మరొక పార్టీలోకి గెంతి అక్కడ టికెట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.భారత రాష్ట్ర సమితి పార్లమెంటు ఎన్నికలలో ప్రభావశీలంగా ఉండగలదనే నమ్మకం ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులలో పూర్తిగా సన్నగిల్లి పోయింది. వారందరి అంచనాలకు తగినట్లుగానే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చాయి. ఇవన్నీ ఉత్తుతివే అని, మేము గెలిచి తీరుతాము అని, తండ్రి కొడుకులు చెప్పుకోవచ్చు గాక.. ఇంకో రెండు రోజుల్లో ఆ మాట చెప్పగల అవకాశాన్ని కూడా వారు కోల్పోతారు! ఇప్పటికైనా మేలుకుంటే కనీసం రాబోయే ఐదేళ్లలో పార్టీని కాపాడుకోవడానికి వారు శ్రద్ధ పెట్టడం కుదురుతుంది. ఇంకా అహంకారం వీడకుండా, వాస్తవాలను గుర్తించకుండా ఆత్మవంచనతో నడుచుకుంటే నష్టపోయేది కల్వకుంట్ల కుటుంబమే.ఐదు నెలల కాంగ్రెస్‌ పాలనకు, తమ పదేళ్ల పాలనకు తేడా చూసి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వేయాలని కేసీఆర్‌ కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు విస్తృతంగా ప్రచారం చేసినా ఆదరించలేదు. పోటీచేసిన స్థానాల్లో మహబూబాబాద్‌, ఖమ్మంలో మాత్రమే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. హైదరాబాద్‌లో లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నాలుగో స్థానానికి పరిమితమైంది. మిగిలిన 14 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ మూడో స్థానంలోలో నిలిచింది.ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో పోలైన ఓట్లలో బీఆర్‌ఎస్‌ కేవలం 16.69 శాతం ఓట్లు మాత్రమే రాబట్టగలిగింది. సంఖ్యాపరంగా ఇది పెద్దగానే కనిపిస్తున్నా అవి సీట్ల రూపంలోకి మారలేదు. ఓట్లపరంగా చూస్తే ఇది కేవలం 36 లక్షల 19 వేల 626 మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *