గోమాసే శ్రీనివాస్ పై 1,31,364 ఓట్ల భారీ మెజారిటీ
అంబరాన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
మూడో తరం నాయకత్వానికి చెయ్యిత్తిన ఓటర్లు
సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఘనవిజయం సాధించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఓట్ల లెక్కింపు రామగిరి మండలం జెఎన్ టియూ కళాశాలలో నిర్వహించారు. 21 రౌండ్లలో ఓట్లను లెక్కించగా రౌండ్ రౌండుకు కాంగ్రెస్ అభ్యర్థి తన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. పార్లమెంట్ పరిదిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల పరిది ఓట్లు లెక్కింపు మంథని జెఎన్ టియూలో చేపట్టారు. చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిది ఓట్లు మంచిర్యాల ఐజ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ 23,495 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ 18,401 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 9312 ఓట్లు సాధించారు. ఇలా ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ మెజారిటీ సాధించారు. 21 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ 4,75,587 ఓట్లు సాధించగా, బీజేపీ 3,44,223 ఓట్లు, బీఆర్ఎస్ 1,93,356 ఓట్లు సాధించాయి. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ 1,31,364 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఓటర్లు మూడోతరం నాయకత్వంకు చెయ్యేత్తి స్వాగతం పలికారు. ప్రధాని మోడీ ప్రభంజనంలో కాంగ్రెస్ నిలువదనుకున్న అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ గాలిని వీచేలా చేశారు. ఎమ్మెల్యేలుగా తండ్రి వివేక్, పెద్దనాన్న వినోద్, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేల కృషి వెలసి వంశీకి భారీ మెజారిటీ వచ్చేలా చేసింది. ఒక స్థాయిలో వంశీకి ఆయన సామాజిక వర్గం వారి నుండి వ్యతిరేక పవనాలు వీచినా తండ్రి వివేక్ చాకచక్యం ఎంతో పని చేసిందనే చెప్పాలి. దీనికి తోడుగా బీజేపీ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందనే చెప్పాలి. గతంలో మాదిరిగానే బీజేపీలోని ఓ నాయకుడు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి లోపాయికారి ఒప్పందం జరిగిందనే ఆరోపణలు చేయడం, వారి పార్టీ కార్యకర్తలు బహిరంగంగా చర్చించు కోవడం గమనార్హం. సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ఏదీ ఏమైనా మూడోతరం నాయకత్వానికి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఓటర్లు చెయ్యేత్తడం గడ్డం కుటుంబానికి ఉన్న అనుబంధం విడదీయాలేనిదని రాజకీయ విశ్లేషకులు పేర్కొనడం విశేషం. ఇక ప్రజల ఋణం ఎలా తీర్చుకుంటారోనని ప్రజలు వేచి చూస్తున్నారు……