జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన కూటమి అభ్యర్థులు
కడపలో 20 సంవత్సరాల తర్వాత పసుపు జెండా
సిరా న్యూస్,బద్వేలు;
కడప జిల్లాలో కూటమి గెలుపు సునామి సృష్టించింది. ఒక్క పులివెందుల బద్వేలు మినహా మిగిలిన ఐదు స్థానాల్లో తెలుగుదేశం బిజెపి అభ్యర్థులు గెలిచారు. కడప అసెంబ్లీలో 20 సంవత్సరాల తర్వాత పసుపు జెండా ఎగిరింది. అక్కడ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషను ఓడించి తెలుగుదేశం అభ్యర్థి ఆర్ మాధవి రెడ్డి 18,860 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక ప్రొద్దుటూరు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజు రెడ్డి 22,744 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి రాచమల్లు ప్రసాద్ రెడ్డి పై విజయం సాధించారు. ఇక మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ 20,950 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి రఘురాం రెడ్డి పై విజయం సాధించారు. కమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పుత్త చైతన్య రెడ్డి 25,750 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై విజయం సాధించారు. ఇక పులివెందుల నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బిటెక్ రవి పై 61,687 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక జమ్మలమడుగు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి వైకాపా అభ్యర్థి సుధీర్ రెడ్డి పై 17,191 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాగా బద్వేలు అసెంబ్లీలో వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధా బిజెపి అభ్యర్థి బొజ్జ రోశయ్యపై 18,567 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కాగా అన్నమయ్య కడప జిల్లాలో కూటమి సునామి సృష్టించింది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. వై నాట్ 175 అంటూ విర్రవీగిన వైకాపా బొక్క బోర్లా పడింది. తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు మూకుమ్మడిగా ఫ్యాన్ రెక్కలు తునా తునకలు చేసి పక్కన పడేసాయి సింహం సింగల్ గా వస్తుందంటూ సవాల్ చేసిన జగన్కు ఆయన పార్టీకి ఊహించని పరాజయం ఎదురైంది. వచ్చిన ఫలితాలు వైకాపా నాయకులు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన స్థానాల్లో
సైతం కూటమి చెడుగుడుకు వైకాపా చతికిలబడింది.