ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి
సిరా న్యూస్,తాడేపల్లిగూడెం:
.ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే విజయ శిఖరాలను సులువుగా చేరుకోవచ్చని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. సంస్థలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీపై 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సమావేశంలో దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సెలవుల్లో సైతం ఇక్కడకొచ్చి త్రీడి ప్రింటింగ్ నేర్చుకోవడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే పాఠ్యాంశాలపై పట్టు సాదించడంతోపాటు నిత్యం ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకోవటం బాల్యం నుంచే అలవాటు చేసుకోవాలని చెప్పారు. విద్యార్థులు వేసే ప్రతి అడుగు విజయానికి మెట్టుగా, భవిష్యత్తుకు బాటగా నిలిచినపుడే కలలను సాకారం చేసుకోగలమని వివరించారు. శిక్షణ పొందిన 44 మంది విద్యార్థులకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి.బాబూరావు, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ డాక్టర
్ కార్తికేయ శర్మ, ఆచార్యులు డాక్టర్ వి.సందీప్ తదితరులు పాల్గొన్నారు.