సిరాన్యూస్, ఆదిలాబాద్
గ్రూప్- 1 నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ రాజర్షి షా
గ్రూప్- 1 పరీక్ష నిర్వహణ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఛీప్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, ఐడెండిఫికేషన్ ఆఫీసర్స్, బయోమెట్రిక్ ఆఫీసర్స్ గ్రూప్-1 పరీక్ష నిర్వహణ పై జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీజీపీఎస్సీ ద్వారా ఈ నెల 9 వ తేదీన నిర్వహించబోతున్న గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని, పరీక్ష వ్రాసే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు ఉండాలని ఆదేశించారు. ఛీఫ్ సూపరింటెండెంట్లు పరీక్ష నిర్వహణను చేపట్టాలని, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కేంద్రాలలో సీటింగ్ అరేంజ్మెంట్, వసతులు పరిశీలించాలని, మహిళలు, పురుషుల అభ్యర్ధులకు విడివిడిగా తనిఖీ ఏర్పాట్లు చేయాలని, ఇతరులను అనుమతించవద్దని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ యాక్షన్ ప్లాన్ కార్యాచరణతో పరీక్షాల కేంద్రాలను పరిశీలించాలని, పరీక్ష రోజున ప్రతి సెంటర్ మూడు సార్లు పరిశీలించాలని, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లు అభ్యర్ధుల ఐడి కార్డులతో హాల్ టిక్కెట్లను పరిశీలించాలని, పరీక్షా కేంద్రాలలో మొబైల్ ఫోన్లు ఎవరికీ అనుమతి లేదని, ఒక చీఫ్ సూపరింటెండెంట్ కు మాత్రమే ఎమర్జెన్సీ పర్పస్ అనుమతి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్ష వ్రాసే అభ్యర్ధులు కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలని తెలియచేస్తూ ఈ నెల 9 వ తేదిన జరిగే గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయము 10.30 గంటల నుండి మద్యాహ్నం 01.00 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, 6729 మంది అభ్యర్డులు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల గురించి, హాల్ టికెట్ డౌన్ లోడ్ గురించి జిల్లా స్థాయి హెల్ప్ లైన్ నెం. 9491053677 కు సంప్రదించ వచ్చునని సూచించారు. అభ్యర్థులు పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్ష హాలు నుండి బయటకు వెళ్ళేందుకు అనుమతించబడరని, పరీక్ష హాలును వదలి వెళ్ళే ముందు, అభ్యర్థి ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ను ఇన్విజిలేటర్కు అందజేయాలని, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ద్వారా అభ్యర్థి తన బయోమెట్రిక్ ను క్యాప్చర్ చేసే వరకు పరీక్ష హాలు నుండి బయటకు అనుమతించబడరని, అభ్యర్థి ఎవరైనా తన బయోమెట్రిక్ ను ఇవ్వకపోతే వారి ఓఎంఆర్ ఆన్సర్ షీట్ మూల్యాంకనం చేయబడదని తెలిపారు.చేతులకు మెహంది, టాటూలతో పరీక్షకు వెళ్లకూడదని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు షూస్, సాక్స్ ధరించరాదని, కేవలము చెప్పులు మాత్రమే ధరించాలని ఆన్నారు.పరీక్ష కేంద్రము లోనికి ప్రవేశించడానికి ఉదయము 09.00 గంటల నుండి 10.00 గంటల వరకు అనుమతి ఉంటుందని, ఉదయం 10.00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైననూ పరీక్ష హాలు లోనికి అనుమతించబడరని, పరీక్ష కేంద్రము మెయిన్ గేట్ ఉ.10.00 గం.లకు మూసివేయబడు తుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్దికి ఒకవేళ చేతులు లేకపోతే సహాయకులు కావాలి అని ముందుగానే దరఖాస్తు చేసినవారికి మాత్రమే పరీక్ష కేంద్రము వారు స్క్రైబ్ ను ఇస్తారని, అనుమతి లేకుండా ఎవరూ సహాయకులను తీసుకురాకూడదని తెలిపారు. అభ్యర్థులు పరీక్షకు కనీసం ఒకరోజు ముందుగా తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా కేంద్రం యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని తెలుసుకోవాలని కోరారు. పరీక్ష కేంద్రము లోకి వాటర్ బాటిల్ అనుమతించరని, పరీక్ష కేంద్రం వారే త్రాగు నీటి సౌకర్యము కల్పిస్తారని, పరీక్ష కేంద్రము లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైలు ఫోన్ లు, కాలిక్యులేటర్లు, చేతి గడియారాలు,హాండ్ బ్యాగ్ లు, బ్లూటూత్ డివైస్ లు, పెన్ డ్రైవ్ లు, రైటింగ్ ప్యాడ్ లు, తెల్ల కాగితాలు అనుమతించబడవని, పరీక్ష కేంద్రము వద్ధ వస్తువులు భద్రపరచడానికి కమిషన్ ఎలాంటి క్లోక్ రూమ్, స్టోరేజీ సౌకర్యం కల్పించలేదని, అభ్యర్డులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. పరీక్ష వ్రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం, సమయాన్ని అంచనా వేయడానికి ప్రతి అరగంట పూర్తయిన తర్వాత హెచ్చరిక బెల్ మోగించబడుతుందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు ఈ సూచనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.