బాండ్లు సేకరిస్తున్న విశాఖ కార్పొరేషన్

సిరా న్యూస్,విశాఖపట్టణం;
లోక్‌సభ ఎన్నికల ముందు కొద్దిగా మందగించిన బాండ్‌ మార్కెట్‌, ఇప్పుడు మళ్లీ రైజింగ్‌లో ఉంది. నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లు బాండ్లను జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. విశాఖపట్నంతో పాటు నాసిక్, కాన్పూర్, సూరత్, వారణాసి, ప్రయాగ్‌రాజ్ వంటి 6 పెద్ద నగరాల సివిక్‌ బాడీలు బాండ్ మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతున్నాయి. ఇవన్నీ.. మునిసిపల్‌ బాండ్లు జారీ చేసి డబ్బు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నాయని జాతీయ మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది. ఈ మునిసిపల్ బాడీలు వచ్చే నెల (జులై 2024) చివరిలోగా మునిసిపల్‌ బాండ్లను జారీ చేయవచ్చు. దీనర్ధం… వచ్చే నెలన్నర రోజులు బాండ్ మార్కెట్‌లో చాలా బిజీని మనం చూడబోతున్నాం. రిపోర్ట్స్‌ను బట్టి చూస్తే… బాండ్ల జారీ ద్వారా మునిసిపల్ కార్పొరేషన్లు 100 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల వరకు సేకరించే ఛాన్స్‌ ఉంది. బాండ్ల జారీని సింపుల్‌గా చెప్పాలంటే… మునిసిపల్‌ సంస్థలు పెట్టుబడిదార్ల నుంచి అప్పు తీసుకుంటాయి, ఆ మొత్తాన్ని నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి చెల్లిస్తాయి. బాండ్లు కొనేవాళ్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను మునిసిపల్ కార్పొరేషన్లు ఆఫర్‌ చేయబోతున్నట్లు సమాచారం. బాండ్ ఇష్యూలపై పెట్టుబడిదార్లకు 7.9 శాతం నుంచి 8.3 శాతం వరకు వడ్డీ ‍‌ లభించొచ్చు.మునిసిపల్ కార్పొరేషన్లకు చాలా బాధ్యతలు ఉంటాయి. నగరాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కొనసాగించడానికి, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మునిపల్ కార్పొరేషన్లకు డబ్బు కావాలి. బాండ్ల జారీ ద్వారా ఆ డబ్బును సమీకరించడం వాటి ముందున్న మార్గాల్లో ఒకటి. గతంలో, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కూడా బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించింది. దీంతోపాటు… అహ్మదాబాద్, భోపాల్, ఇండోర్, పుణె, లఖ్‌నవూ మునిసిపల్ బాడీలు కూడా 2017 నుంచి 2024 మార్చి మధ్యకాలంలో బాండ్లను ఇష్యూ చేశాయి. ఈ 6 మునిసిపల్ సంస్థలు కలిసి, ఈ ఏడేళ్లలో సుమారు రూ.3,000 కోట్లు సమీకరించాయి. ఇటీవల, వడోదర మున్సిపల్ కార్పొరేషన్ కూడా ‘సర్టిఫైడ్ గ్రీన్ మున్సిపల్ బాండ్‌’లను జారీ చేసి రూ.100 కోట్లు సేకరించింది. ఈ డబ్బును మంచినీటి మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉపయోగిస్తుంది.ప్రస్తుతం, మునిసిపల్ కార్పొరేషన్లు ప్రారంభించే మునిసిపల్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి సంస్థాగత పెట్టుబడిదార్లకు మాత్రమే అనుమతి ఉంది. రిటైల్ పెట్టుబడిదార్లకు కూడా అవకాశం కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ దిశలో, గత సంవత్సరం విడుదలైన ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ బాండ్లు మొట్టమొదటివి. సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం తీసుకొచ్చిన ఆ ఇష్యూలో ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ రూ.244 కోట్లు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కూడా డబ్బును పెట్టుబడి పెట్టిన మొదటి మునిసిపల్‌ బాండ్‌ ఇష్యూ అదే.
==================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *