కమలానికి కొమ్ము కాసిన సౌత్

సిరా న్యూస్;

దేశమంతా ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసిన 18వ లోక్‌సభ ఫలితాలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో సుమారు 64 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవటం ద్వారా మనది ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం అనే మాటకు మరింత బలం చేకూరింది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలు ఓట్లు లెక్కింపు వరకు 81 రోజుల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ సాగింది. ఈ ఎన్నికల్లో 400 సీట్లే తమ లక్ష్యమని ప్రకటించుకుని బరిలో దిగిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 293 స్థానాలు సాధించగా, ఇందులో ప్రధాన పార్టీగా బీజేపీకి దక్కింది కేవలం 240 సీట్లే. ఎన్డీయేకు ప్రత్యర్థిగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లోని పార్టీలతో కలిసి నడిచిన ఇండియా కూటమి అంచనాలకు అందని రీతిలో 234 స్థానాలను చేజిక్కించుకుంది. గత ఎన్నికలతో పోల్చితే ఎన్డీయే కూటమి 58 స్థానాలను కోల్పోగా, ఇండియా కూటమి 149 స్థానాలను అదనంగా పొందగలిగింది. ఈ రెండు కూటముల్లో భాగస్వామ్యం లేని పార్టీలు ఈ ఎన్నికల్లో 17 స్థానాలు పొందాయి. ఫలితాలు ఎవరికి అనుకూలంగా వచ్చాయనేది పక్కనపెడితే, ఈసారి గతంలో కంటే తెలివిగా, చైతన్యవంతంగా ఎన్నికల్లో ఓటు వేశారని అనిపించింది. ఈ ఎన్నికలకు సంబంధించి జూన్ 1వ తేదీన వచ్చిన ఎగ్జిట్ ఫలితాలేవీ వాస్తవ ఫలితాలను ప్రతిబింబించలేకపోయాయి.పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వపు ఏకపక్ష విధానాలు, బలమైన ప్రాంతీయ ఆకాంక్షలతో బాటు సోషల్ మీడియా యూజర్లలో వచ్చిన పరిణతి కూడా కారణంగా కనిపించింది. అయోధ్య, ఆర్టికల్ 370 అంశాలను ప్రజలు తిరస్కరించినట్లూ ఎన్నికల గణాంకాలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. రోజు వెళ్లదీసేందుకు పోరాటం చేసే బడుగు జీవులెవరికీ ఈ భావోద్వేగ అంశాలేవీ తమ బతుకును బాగుచేస్తాయనే నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. మరోవైపు.. విపక్ష ‘ఇండియా’ కూటమి మోదీ ప్రభుత్వపు ప్రభను తగ్గించటం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అయితే, ఈ ప్రయత్నాల్లో కొంత అపరిపక్వత, గందరగోళం, దేశంలో ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని హరించే ప్రయత్నాలు జరగుతున్నా.. ఆ వాస్తవాన్ని గ్రహించి, అంగీకరించటానికి ఇండియా కూటమిలోని అనేక పార్టీలు పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవటంతో ఈ కూటమి అధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. రాజ్యాంగానికి ప్రమాదముందనే ప్రచారం, రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళల సమస్యలను ప్రధాన అంశాలుగా ప్రస్తావించటం, గతంలో రాహుల్ చేసిన పాదయాత్ర వంటి అంశాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. అయితే, ఇండియా కూటమిలో చేరిన పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహ చతురత చూపలేకపోవటం, ఆ పార్టీలు తమ బలహీనతలను అధిగమించలేకపోవటం ఒక లోటుగా కనిపించింది.ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి పగ్గాలు వేయటంలో సోషల్ మీడియా కూడా తనవంతు పాత్రను పోషించింది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో సోషల్ మీడియాను బాగా వినియోగించుకున్న బీజేపీ ఈసారి ఈ విషయంలో బోర్లాపడింది. గత రెండు ఎన్నికల్లో అసత్యాలను, అర్థసత్యాలను, అపోహలను, భయాలను జనంలోకి తీసుకుపోవటంలో ఆ పార్టీ పైచేయి సాధించింది. ఈసారీ ఈ బాణం పారుతుందని ఆశించింది గానీ ఈ వ్యూహాన్ని కొందరు ఔత్సాహిత సోషల్ మీడియా కార్యకర్తలు దీనిని తమదైన శైలిలో కట్టడి చేయగలిగారు. భారత ఆర్థిక వ్యవస్థ, సామాజిక పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలు, రైతుల సమస్యలు, మోదీ పాలనలో కార్పొరేట్లకు చేరుతున్న దేశసంపద, విపక్షాల నేతలను ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలు బెదిరించి తమవైపు లాక్కుంటున్న తీరు, అనైతిక మార్గాల్లో బీజేపీ సంపాదించుకున్న ఎన్నికల బాండ్లు వంటి అనేక అంశాలపై ధ్రువ్ రాఠీ, సీనియర్ పాత్రికేయుడు రవీష్ కుమార్ వంటి వందల మంది తమ వీడియోలతో ప్రజలకు నిజాలేమిటో చెప్పటంలో విజయవంతమయ్యారు. తద్వారా వాస్తవాలు, అసత్యాల మధ్య ఉన్న అంతరాన్ని పసిగట్టగల చైతన్యం ఓటర్లలో పెరిగేలా చేశారు. దీంతో ఎప్పటిలాగే భావోద్వేగ అంశాలతో గట్టెక్కగలమన్న పాలక పక్షం ఆశలపై వీరు నీళ్లు చల్లారు.ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన మరో పరిణామం కూడా చోటు చేసుకుంది. ఉత్తర, తూర్పు, పశ్చిమ భారత దేశంలోని ఓటర్లు బీజేపి పట్ల అనాసక్తిని, విముఖతను ప్రదర్శించగా, దక్షిణాది ఓటర్లు మాత్రం కమలాన్ని ఆదరించారు. బీజేపీ ఆవిర్భావం తర్వాత బీజేపీ కేరళలో తొలిసారి ఖాతా తెరవటమే గాక 17 శాతం ఓటు బ్యాంకును ఆ పార్టీ పొందగలిగింది. తమిళనాడు గతంలో బీజేపీకి ఉన్న 3.2 శాతం ఓటుబ్యాంకు ఈసారి 11.2 శాతానికి పెరిగింది. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల వేళ 14 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు ఏకంగా 35.08 శాతానికి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ సాధించలేక బోల్తా పడిన బీజేపీ, ఈసారి అక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను గెలిపించుకోగలిగింది. తమిళనాడు, కేరళను మినహాయిస్తే, ఏపీలో పొత్తు పార్టీలైన జనసేన, టీడీపీ బలమే బీజేపీ బలం కాగా, తెలంగాణలో బీఆర్ఎస్ పరోక్ష మద్దతే బీజేపీ బలం అయింది.18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేళ కనిపించిన మరో అరుదైన దృశ్యాన్ని కూడా మనం చెప్పుకుని తీరాలి. సహజంగా ఏ ఎన్నికల్లోనైనా విజేతలు సంతోషాల్లో మునిగిపోవటం, అధికారం దూరమైన వారు నిరాశకు లోనుకావటం జరుగుతుంది. కానీ, మంగళవారం నాటి లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తిరిగి అధికారంలోకి రానున్న కారణంగా బీజేపీ, వందసీట్లు దాటి ఇండియా కూటమిని బలోపేతం చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషాల్లో మునిగిపోయారు. అటు యూపీలోని సమాజ్ వాదీ పార్టీ, బీహార్‌లోని ఆర్జేడీలు తమ సొంతబలాన్ని తిరిగి పొందినందుకు సంతోష పడ్డాయి. మహారాష్ట్రలోని శరద్ పవార్, ఉద్ధవ్ వర్గాలు తాము పైచేయి సాధించామని సంతోషపడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన గెలుపు కంటే కమలాన్ని కట్టడిచేయగలిగినందుకే వేడుకల్లో మునిగిపోయింది. ఏదో ఒక స్థాయిలో తాము ఆశించిన ఫలితాలు సాధించటం లేదా ప్రత్యర్థి విఫలం కావటం వల్లనేమో.. విచిత్రంగా ఈసారి ఏ పార్టీ కూడా ఈవీఎం యంత్రాల మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు.రెండు పార్లమెంటు ఎన్నికల్లో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి సిద్ధం అవుతోంది. గత పదేళ్ల కాలంలో ఏకపక్ష నిర్ణయాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల చిన్నచూపుతో వ్యవహరించిన మోదీ అండ్ కో.. ఈసారి చాలా పరిమితులకు లోబడి పాలన చేయబోతున్నారు. జాతీయవాదమే సర్వోన్నతం, సర్వోత్తమం అంటూ దశాబ్దకాలంగా వీరంగాలు వేసిన కమలం పార్టీ.. ఇప్పుడు అనివార్యంగా దేశపు వైవిధ్యాన్ని, బహుళత్వ విలువలను, బలమైన ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించి తీరాల్సిన అనివార్యత ఏర్పడింది. అదే సమయంలో లోక్‌సభలో కాంగ్రెస్ నాయకత్వంలోని బలమైన ఇండియా కూటమిని కూడా బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంది. ఏదిఏమైనా.. కీలక ప్రభుత్వ నిర్ణయాల విషయంలో పార్టీల ఏకాభిప్రాయ సాధన, విపక్షపు మాటకు మన్నన, భిన్నమైన ఆలోచనలకు గౌరవం వంటి కనుమరుగైన అరుదైన పార్లమెంటరీ సంప్రదాయాలకు ఈ 18వ లోక్‌సభ ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగితే.. ఈ 18వ లోక్‌సభ సాధించే అతిపెద్ద విజయం ఇదే అవుతుంది. అది ఆచరణలోకి రావాలని, వస్తుందని ఆశిద్దాం.
============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *