మోడీ ప్రమాణానికి భారీ ఏర్పాట్లు

సిరా న్యూస్,న్యూఢిల్లీ;
ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విదేశాధినేతలూ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిని భద్రతా బలగాలు మొహరించాయి. హైఅలెర్ట్ ప్రకటించారు. పలు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పారామిలిటరీకి చెందిన 5 దళాలు, NSG కమాండోలు సెక్యూరిటీ అందించున్నాయి. వీటితో పాటు అణువణువునా నిఘా పెట్టేందుకు డ్రోన్‌లను రంగంలోకి దించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనున్నందున ఆ పరిసరాల్లో స్నైపర్స్‌నీ ఏర్పాటు చేయనున్నారు. సార్క్ దేశాల తరపున పలువురు ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. గతేడాది G20 సమావేశాలకు ఎలాంటి భద్రత అయితే ఏర్పాటు చేశారో..అదే స్థాయిలో ఇప్పుడూ సెక్యూరిటీ ఇవ్వనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ముఖ్య అతిథులు హోటల్ నుంచి వేదిక వరకూ ఎలా రావాలో ముందే ఓ రూట్ మ్యాప్ ఇస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ఓ నోటీస్‌ విడుదల చేశారు. ఆ రోజున డ్రోన్‌లు కానీ, పారా మోటార్స్, పారా గ్లైడర్స్ కానీ హాట్ ఎయిర్ బెలూన్స్‌ కానీ ఎగరేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. స్నైపర్స్‌తో పాటు సాయుధ బలగాలతో గస్తీ కాయనున్నారు. ఢిల్లీవ్యాప్తంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్‌లను ఎగరేస్తూ నిఘా పెట్టనున్నారు. బంగ్లాదేశ్ ప్రధానితో పాటు భూటాన్, నేపాల్, మారిషస్, మాల్దీవ్స్ దేశాధినేతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. వీళ్లంతా లీలా, తాజ్, ఐటీసీ మౌర్య, ఒబెరాయ్ హోటల్స్‌లో బస చేయనున్నారు. ఇక్కడా భద్రతను పెంచారు. AI టెక్నాలజీని వినియోగించనున్నారు. ట్రాఫిక్‌ మళ్లింపుల వివరాలనూ పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *