పాఠ్య,నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించాలి
మండల ప్రత్యేక అధికారులు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాలను పరిశీలించాలి
జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ భాషా
సిరా న్యూస్,జగిత్యాల,
పాఠశాలలు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా తరగతి గదులు శుభ్ర పరచడం, మౌలిక సదుపాయాలు కల్పించడం జరగాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి అనంతరం పాఠశాలల పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడం, పాఠ్య , నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించడం జరగాలని అన్నారు. అదేవిధంగా వసతి గృహాల్లో కూడా అన్ని శుభ్రం చేయించాలని, గత సంవత్సరం పాఠశాలలు ముగింపు సమయంలో మిగిలి పోయిన బియ్యం, తదితర సామాగ్రి ఈ సంవత్సరం వాడకుండా కొత్తగా ఇండెంటు సమర్పించి సరుకులు తీసుకోవాలనీ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, తదితర విద్యా సంస్థల జిల్లా అధికారులకు సూచించారు. పాఠశాలలు, విద్యాసంస్థలు, వసతి గృహాలు లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ముందస్తు సరుకు తీసుకునే ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ విద్యా సంవత్సరం లో విద్యార్థులకు ఏకరూప దుస్తులను ఆయా మండలాల వారీగా, పాఠశాలల వారీగా పాఠశాలలు ప్రారంభ నాటికి పంపించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు వారి మండలాల్లో పర్యటించి పాఠశాలల పునః ప్రారంభం సమయంలో పాఠశాలలను తనిఖీ చేయాలని, అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాలను పరిశీలించాలని సూచించారు. అదేవిధంగా మిషన్ భగీరథ సర్వే పనులను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దివాకర, పి.రాంబాబు, ఆర్డీఓ లు పి. మధుసూదన్, శ్రీనివాస్, జిల్లా అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.