కులగణన దిశగా అడుగులు

సిరా న్యూస్,వరంగల్;
తెలంగాణలో దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్న కులగణనపై కసరత్తు ప్రారంభమయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన కుల సర్వే చేయడానికి గతంలోనే అసెంబ్లీలో అమోదం లభించింది. ఈలోగా ఎన్నికల కోడ్, పార్లమెంట్ ఎన్నికల హడావిడితో కులగణన అంశం పెండింగ్ లో ఉండిపోయింది. అయితే రాష్ట్రంలో చేపట్టబోయే కులగణనకు దాదాపు అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ సర్కార్ అంత సానుకూలంగా లేకపోయినా తెలంగాణలో రాష్ట్ర నేతలు మాత్రం కులగణనకు మద్దతు తెలుపుతునే ఉన్నారు. ఈ మేరకు కులసర్వే విధివిధానాల అమలు పద్దతులు, ప్రశ్నావళి రూపకల్పన తధితర పద్ధతులపై బీసీ కమిషన్ చర్యలు మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులతో పీపుల్స్ కమిటీ భేటీ అయింది. కులగణనపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చ జరిపారు. స్థానిక ఎన్నికలు జరిగే లోపే రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.అసలు ఈ కులగణన ఏమిటి? దీని వలన వచ్చే లాభం ఏమిటి? దాని ఆవశ్యకత ఏమిటి అని చాలా మందికి సందేహాలున్నాయి. భారత దేశంలో మొట్టమొదటిసారి 1931లో బ్రిటీష్ కాలంలోనే కులగణన జరిగింది. అప్పటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు కూడా భారత్ లోనే కలిసివున్నాయి. ఆ తర్వాత ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా కులగణన అంశాన్ని సీరియస్ గా తీసుకోలేదు. పైగా 1941 జనాభా లెక్కల నుంచి ఈ కేటగిరీనే తీసివేశారు. చదువు, ఉద్యోగాల కోసం దరఖాస్తులలో కులం కేటగిరీని చేర్చారు. కేవలం ఆ లెక్కల ఆధారంగానే ఇప్పటిదాకా ఇంత మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, తదితరులు ఉన్నారని లెక్కలు వేస్తూ వస్తున్నారు. వీటి ఆధారంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం అమలుచేస్తూ వస్తున్నారు. అయితే ఇవన్నీ అధికారిక లెక్కల కిందకి రావు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 2011-12లో సామాజిక, ఆర్థిక, కులగణన చేపట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఆ లెక్కలేవీ ఇప్పటిదాకా బయటకు రాకపోవడం గమనార్హం.సాధారణంగా జనాభా లెక్కల్లో కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభాను మాత్రమే లెక్కలేస్తారు. కానీ అన్ని సామాజిక వర్గాల జీవన స్థితిగతులు ముఖ్యంగా ఆర్థిక, ఉపాధి, ఉద్యోగ, వ్యవసాయ, సంఘటిత, అసంఘటిత వ్యాపార రంగాలను కూడా ప్రాతిపదికన తీసుకోవాలి. అలా జరిగినప్పుడే అన్ని వర్గాలకు లబ్ధి చేకూరే అవకాశం కలుగుతుంది. మనదేశంలో జనాభా లెక్కలు మొదలైన కొత్తలో ఎక్కువమంది ప్రజలు వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, కులవృత్తులు, చిరువ్యాపారాలు, కూలీపనులు చేస్తూ బతికేవాళ్లు. కానీ.. స్వాతంత్రం వచ్చాక ఆధునిక పరిశ్రమలు, సేవారంగం విస్తరించాయి. అనాదిగా ఉన్న అనేక వృత్తులు అదృశ్యమైపోతున్నాయి. చిరువ్యాపారులు తమ అవకాశాలు కోల్పోతున్నారు. కార్పొరేట్‌‌ వ్యాపార సంస్థల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై పోయిన విషయం స్పష్టంగా కనిపిస్తుస్తోంది.నూతన ఆర్థిక విధానాల వల్ల ఆర్థిక అసమానతలు అనేక రెట్లు పెరిగాయని అనేక జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెసుకోవాల్సిన, అన్ని కులాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, ఉపాధి, ఉద్యోగ పరిస్థితులపై ఒక సమగ్ర అంచనా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ టెక్నాలజీ, సరైన ప్రభుత్వం, అధికార యంత్రాంగం లేని టైం1881లోనే కులగణన జరిగింది. అలాంటిది ఇప్పుడు పటిష్టమైన ప్రభుత్వాలు, అధికారులు, టెక్నాలజీ సపోర్ట్‌‌గా ఉండగా ఇప్పుడు కులగణన చేయడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పుటికే బీహార్‌‌‌‌, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌‌, తెలంగాణల్లో కులగణన చేశారు. కానీ.. వాటికి ఆ ప్రభుత్వాలు పెట్టిన పేర్లే వేరు. రాష్ట్రాలకు తగిన అధికారం లేకపోవడం వల్ల సర్వే పేరుతో కులగణన చేస్తున్నారు. కాకపోతే.. వీటిలో తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలు ఆ డాటాను బయటపెట్టలేదు. అయితే.. ఈ గణనలో కులం ఒక్కటే కాకుండా ఆ కుటుంబాల సమగ్ర పరిస్థితి కనుక్కోవాలి. అప్పుడే వాళ్లు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ల కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి? అనేది తెలుస్తుంది.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *