సిరాన్యూస్, బోథ్
మొలక దశలోనే ముంచిన వర్షం
* భారీ వర్షాలకు కొట్టుకు పోయిన విత్తనాలు
* ఆందోళనలో రైతులు
విత్తనాలు వేసి నెల రోజులు కూడా గడవకముందే వర్షాలు బాగా పడటంతో విత్తనాలు మొలక దశలోనే దెబ్బతిన్నాయి.ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో సోమవారం రాత్రి కురిసిన వర్షం వల్ల భూములు కోతకు గురవడంతోపాటు పంట పొలాల్లో మట్టి దిబ్బలు పేరుకపోయాయి. వాగుల సమీప పంట పొలాలలో ఇసుక మేటలు వేశాయి. దీంతో వందలాది ఎకరాల్లో మొలక దశలో ఉన్న పంటకు విత్తనాలకు నష్టం వాటిల్లింది. మండలంలోని ధన్నూర్, బోథ్, కౌట, కనుగుట్ట, సోనాల గ్రామాలలో పొలాలలో భూములు కోతకు గురై అక్కడ మట్టి దిబ్బలు వేయడం జరిగిందని రైతులు వాపోతున్నారు. మరోవైపు వర్షాల కోసం విత్తనాలు నాటిన రైతులు ఎదురుచూస్తున్న తరుణంలో భారీ వర్షం రైతులను ఆర్థికంగా నష్టం చేసిందని అంటున్నారు. మరోసారి విత్తనాలు నాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అసలే విత్తనాలు దొరకక రైతులు ఆందోళన చెందుతుంటే ప్రకృతి తమపై కన్నెర్ర చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.