సిరా న్యూస్;
దేశంలో నిరుద్యోగ సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. ప్రతి సర్వేలో మంచి జీతంతో కూడిన సురక్షితమైన ఉద్యోగాలు లేకపోవడమే తమ సమస్య అని దేశ ప్రజలు చెబుతున్నారు. భారతీయ జనాభాలో మూడింట రెండొంతుల మంది పని చేసే వయస్సులో ఉన్నారు. అంటే, వారు 15-65 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. పని చేసే వయస్సు గల వ్యక్తుల ఈ నిష్పత్తి ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ. అయినప్పటికీ, పని చేసే వయస్సులో ఎక్కువ మంది వ్యక్తులు ఎటువంటి వేతనంతో కూడిన పని దొరకక వారి శక్తి పూర్తిగా వృధా అవుతోంది. వీరిని నిరుద్యోగులుగా పరిగణిస్తున్నారు. వాస్తవానికి ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారీగా ఉన్నంత కాలం నిరుద్యోగానికి పరిష్కారం లేదు. సమస్యకు పరిష్కారం లేకపోవడంతో, రాజకీయ పార్టీలు కుల ప్రాతిపదికన రిజర్వేషన్ కోటాల కోసం ప్రజల మధ్య పోటీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఉన్న కొద్దిపాటి ఉద్యోగాల విషయంలో నిరుద్యోగ యువత తమలో తాము పోట్లాడుకునేలా చేస్తున్నారు. సమస్య మూలాన్ని తొలగించకుండా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు.యువతకు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది యువత శ్రామికశక్తిలో చేరుతున్నారు కానీ వారిలో చాలా మందికి వేతనంతో కూడిన పని దొరకడం లేదు. 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించిన తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం దేశంలో 15-29 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు. నిరుద్యోగులందరిలో సెకండరీ పాఠశాల పూర్తి చేసిన యువత నిష్పత్తి 2000లో 54% ఉండగా, అది 2022 నాటికి 66%కి పెరిగింది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం క్లరికల్ ఉద్యోగాల్లో కొన్ని వందల ఖాళీలను భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించినప్పుడల్లా వేలాది మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పీహెచ్డీలు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారు. అధిక అర్హత కలిగిన యువతలో చాలా తక్కువ మందికి ప్రైవేట్ కంపెనీలలో రెగ్యులర్ ఉద్యోగాలు లభిస్తున్నాయి.మరోవైపున లక్షలాది మంది యువత రైల్వేలో లేదా ఇతర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగం కోసం, ఒకదాని తర్వాత మరొకటి అర్హత పరీక్షలకు సిద్ధమవుతూ, రాస్తూ వృథాగా సంవత్సరాలు గడుపుతున్నారు. ఏటా ఉద్యోగాల సృష్టి కంటే తగ్గుతున్నవే ఎక్కువ. ఈ ఏడాది ఐఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా ఉద్యోగం కోసం కష్టపడుతున్నారు. అందుబాటులో ఉన్న ఉద్యోగాల పరిమాణం నిలిచిపోవడమే కాకుండా, ఉద్యోగాల నాణ్యత క్షీణిస్తోంది. మెజారిటీ కంపెనీలలో, సాధారణ శాశ్వత ఉద్యోగాల కంటే తాత్కాలిక ఒప్పంద ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఎక్కువ మంది కార్మికులు ఎటువంటి సామాజిక భద్రత లేకుండా ఎక్కువ గంటలు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయవలసి వస్తుంది. భారీ సంఖ్యలో నిరుద్యోగుల ఉనికి ఉపాధి కార్మికుల వేతనాలను తొక్కివేయడానికి, వారి హక్కులను హరించడానికి కూడా ఉపయోగించబడుతోంది. జీవనం కొనసాగించడానికి ఎక్కువ పని గంటలు పని చేసే పరిస్థితి ఉంది.ప్రభుత్వరంగంలో భారీ పరిశ్రమల స్థాపన ఉనికి లేకపోవడంతో విస్తృత సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు గండి పడింది. నిరుద్యోగం పెరుగుదల రేటు 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2017–18లో 6.1శాతానికి ఎగబాకింది. కోవిడ్ ముమ్మరించిన 2020 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 20.8 శాతానికి చేరుకొని విలయ నాట్యమాడింది. ఆ కాలంలో పట్టణాల నుంచి పల్లెలకు ఎదురు వలసలు విజృంభించాయి. ఆ విపత్కాలంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం విశేషంగా తోడ్పడింది. ఎంతగా అంటే 2019లో ఈ పథకం ద్వారా 260 కోట్ల వ్యక్తి దినాల ఉపాధి పని కల్పించగా 2021లో అది 390 కోట్ల వ్యక్తి దినాలకు పెరిగింది. భూమిలేని నిరుపేద గ్రామీణ వ్యవసాయ కార్మికులకు పని హక్కును కల్పించడానికి యూపీఏ ప్రభుత్వం ఆవిష్కరించిన ఈ పథకాన్ని బలహీనపరచేందుకు కేంద్రంలోని అధికారపక్షం శతవిధాలా ప్రయత్నించింది. ఈ పథకానికి ఆధార్ అనుసంధానమనే గుదిబండను వేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది. దీనికి బడ్జెట్లో కేటాయింపుల కోత వంటి చర్యలకూ ప్రభుత్వం పాల్పడింది. బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పెద్ద నోట్ల రద్దు పథకం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నిరుద్యోగాన్ని, నిర్వ్యాపారాన్ని పెంచాయి. కింది స్థాయి కార్మికుల పనులను హరించివేశాయి. అనాలోచితంగా ప్రకటించిన ఆకస్మిక లాక్ డౌన్ అసంఘటిత రంగ కార్మిక లోకాన్ని కష్టాల కొలిమిలో తోసివేసింది. నిరుద్యోగాన్ని తగ్గించడానికి శాస్ట్రీయమైన దారులు అనుసరించని మోదీ ప్రభుత్వం దానిని అంచనా వేయడానికి అంతవరకు గల పద్ధతులను కూడా రద్దు చేసింది. ప్రభుత్వం చేపట్టే వార్షిక ఉద్యోగ నిరుద్యోగ సర్వేకి 2017లో స్వస్తి చెప్పింది. కార్మిక విభాగం (లేబర్ బ్యూరో) మూడు మాసాలకు ఒకసారి నిర్వహించే వ్యాపార సంస్థల సర్వేని కూడా మాన్పించింది. ఆచరణలో నిరుద్యోగం లోతులు తెలుసుకోడానికి ఏర్పాటు చేసిన శాస్త్రీయ పద్ధతులకు నిలువ నీడ లేకుండా చేస్తూ నిరుద్యోగానికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేవని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నిస్సహాయత ప్రకటించడం విడ్డూరంగా లేదూ?ఉద్యోగాలు ఎప్పటికీ దొరక్కపోవడంతో విసిగిపోయిన కోట్లాది నిరుద్యోగులు దుర్భరమైన ఆర్థిక బాధలను తట్టుకోడానికి స్వయం ఉపాధులను ఆశ్రయిస్తున్నారని స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా–2023 నివేదిక నిగ్గుదేల్చింది. కార్మికులకు విశేషంగా పనులు కల్పించగల తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ పథకాలను ప్రారంభించింది. ఇవి వచ్చిన తర్వాత 2016–2021 మధ్య తయారీ రంగంలో ఉద్యోగాలు సగానికి పడిపోయాయి. కోవిడ్కి ముందే దేశ తయారీ రంగం కునకడం మొదలుపెట్టింది. ఉద్యోగం ముఖం చాటు చేసినప్పుడు మెజారిటీ కార్మికులు నిర్మాణ రంగాన్ని ఆశ్రయిస్తారు. కోట్లాదిమంది దీనిపైనే ఆధారపడి బతుకుతున్నారు. దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు బ్రిటిష్ పాలనలో కంటే గత పదేళ్ళలోనే ఎక్కువని ప్రపంచ అసమానతల లాబ్ తరపున ఇటీవల అధ్యయనం జరిపిన నలుగురు ప్రఖ్యాత ఆర్థికవేత్తలు నిర్ధారించారు. చదువుకుంటే ఉద్యోగం వస్తుందనేది ఇండియాలో రుజువు కావడం లేదని, ఉన్నత చదువులు చదివే కొద్దీ కొలువు దూరమవుతున్నదని అంతర్జాతీయ కార్మిక సంస్థ తాజా నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది యువతేనని వీరిలో 65 శాతం మంది చదువుకున్నవారేనని ఈ నివేదిక వెల్లడించింది. నిరుద్యోగుల్లో విద్యావంతులు 2000లో 18 శాతం కాగా 2022లో 35 శాతానికి పెరిగారు.మన విద్యావిధానం ఉపాధి కల్పన బాధ్యతను వదిలేసి మొత్తంగా విద్యార్థులను వలసబాట పట్టిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో ఉద్యోగాల కల్పన అంటే ఉపాధి పనుల పేరిట కూలి చేసుకుని బతకడం అనే నిర్వచనం వచ్చింది. రాష్ట్రాల స్థాయిలో 20 లక్షల ఉద్యోగాలు, కేంద్ర స్థాయిలో 2 కోట్ల ఉద్యోగాల కల్పన అంటూ సాగే ప్రచారం పచ్చి బూటకం అని ఇప్పటికే రుజువైపోయింది. ఈ నేపథ్యంలో సమస్య మూలాన్ని తొలగించకుండా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదు.
=============================