బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

సిరా న్యూస్,అమరావతి;
రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభం తోను, అధికారులు పుష్ప గుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. # పండితుల వేద మంత్రోచ్ఛారణ ల మధ్య ఆ భగవంతునికి షోడశోపచారా పూజ నిర్వహించిన తదుపరి తమ సీట్లో ఆసీనులు అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అమల్లోవున్న వైయస్సార్ భీమా పథకానికి పేరు మారుస్తూ తొలి ఫైల్ పై సంతకం చేశారు. వైయస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా పథకంగా పేరు మారుస్తూ తొలి సంతకం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. నవరత్నాల పథకాలు పేరుతో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన 13 పథకాల అమలును నిలుపుదల చేసిందన్నారు. కార్మిక శాఖకు వచ్చిన రూ.3,000 కోట్ల సెస్సును పూర్తిగా పక్కదారి పట్టించడం జరిగిందన్నారు. కార్మిక భీమా పథకం కింద గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు హయాంలో రూ.2.55 కోట్ల భీమా సొమ్మును చెల్లిస్తే, గత ప్రభుత్వ హయాంలో కేవలం రూ.1.25 కోట్లను మాత్రమే చెల్లించడం జరిగిందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి మరియు విజయవాడలలో వున్న ఈ ఎస్ ఐ ఆసుపత్రులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, 238 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నా భర్తీ చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై కూడా పూర్తిగా గత ప్రభుత్వం అశ్రద్ధ వహించిందన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి హరిజవహర్లాల్, కమిషనర్ శేషగిరి బాబు, ఫ్యాక్టరీల డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ, బాయిలర్స్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ ఆంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *