సిరా న్యూస్;
ఎన్నికలంటే లెక్కలు. రాజకీయసమీకరణాలు..కూడికలు…తీసివేతలు.. కానీ చివరికి ఏదో వస్తుందో అదే అన్సర్. చివరకు మిగిలేది అదే.. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి.. కొత్త ప్రభుత్వాలు కొలువు తీరాయి. ఇక రాజకీయ పార్టీలు, నేతలు తప్పు ఎక్కడ జరిగిందని లెక్కలు వేసుకుంటున్నాయి. మెజార్టీలు ఎక్కడ తగ్గాయి.. ఎందుకు తగ్గాయి.. ఓటమికి కారణాలపై దృష్టి పెట్టాయి. అయితే పరిస్థితిలో ఈ ఎన్నికల్లో ఎవరికి ఏం మిగిల్చాయి. దేశంలోని కొద్ది మంది ముఖ్యనేతలకు ఈ ఎన్నికల తర్వాత చివరకు మిగిలిందేంటి అన్న విశ్లేషణ ఇప్పుడు చూద్దాం.. ఏ పార్టీని అధికారం పీఠం ఎక్కించాలన్నా వారిని గద్దె దించాలన్నా ఓటరు మహాశయుడే కీలకం అని మరోసారి సార్వత్రిక ఎన్నికలు తేల్చి చెప్పాయి. ఎన్ని రాజకీయ విన్యాసాలు చేసినా.. ఓటరు తాను నమ్మివారికి, నచ్చిన వారికి మాత్రమే ఓటు వేస్తాడని రుజువు చేశాయి ఈ ఎన్నికలు. అయితే ఈ ఎన్నికలను ఓటరు కోణంలో చూస్తే చివరకు మిగిలిందేంటి అన్న ప్రశ్న వేసుకుంటే ప్రతీ ఐదేళ్ల తర్వాత ఎంతటి బలమైన పాలకుడినైనా మార్చగలిగే శక్తి నాదే అన్న సంతృప్తి ఓటరుకు మిగిలింది.ప్రధాన నరేంద్రమోదీ విషయానికి వస్తే 400 మార్కు దాటుతామని పదే పదే చెప్పినా అంత సీన్ లేదు అంటు బొటాబొటి మార్కులతో నరేంద్రమోదీని ప్రధానిగా పాస్ చేశారు. మళ్లీ అవకాశం ఇస్తున్నామంటే…. కొంచెం జాగ్రత్తగా ఉండమని ఓటర్లు హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో 240 సీట్లే బీజేపీ గెల్చినా మళ్లీ అధికారంలోకి రాగలిగామన్న సంతృప్తి ఈ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్రమోదీకి మిగిలింది.మోదీ తర్వాత దేశ రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తి రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత. ఈ ఎన్నికల ద్వారా పని చేస్తే ఫలితం ఉంటుందని ఓటరు తీర్పు చెప్పి మరీ రుజువు చేశాడు. రెండు దఫాలుగా దేశంలో చేసిన పాదయాత్రకు చిహ్నంగా కాంగ్రెస్కు 99 సీట్లు కట్టబెట్టాడు. 2019 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ సీట్లు రెట్టింపు అయ్యాయి. అధికారంలోకి రాకపోయినా దరిదాపుల్లోకి ఇండియా కూటమిని తీసుకువచ్చామన్న తృప్తిని ఈ ఎన్నికలు మిగిల్చాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ను దేశ రాజకీయాల్లో నిలబెట్టగల సామర్థ్యం ఉందని రుజువు చేసుకున్న సంతృప్తి రాహూల్ది.యూపీకి వెళ్తే అఖిలేశ్ యాదవ్. హేమాహేమీల్లాంటి రాజకీయ ఉద్దండులు తమ రాష్ట్రం నుంచి పోటీలో ఉన్నా సమాజ్ వాదీ పార్టీని రాష్ట్రంలో నెంబర్ వన్గా నిలిపారు. అదే రాష్ట్రం నుంచి ప్రధాని మోదీ పోటీ చేసినప్పటికీ.. ఆయన్ని ఎదుర్కొని మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నారు. 80 ఎంపీ సీట్లకు బీజేపీ కూటమి 36 స్థానాలే గెల్చుకుంటే, సమాజ్ వాదీ ఉన్న ఇండియా కూటమి 43 స్థానాల్లో గెలిపించిన నేతగా అఖిలేశ్కు ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చాయి.
దీదీ మమతా బెనర్జీ మరో దఫా పశ్చిమ బెంగాల్ తన ఇలాఖా అని చాటి చెప్పారు. బీజేపీని అడ్డుకోవడంలో తనకు తిరుగులేదన్న సంకేతం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా చెప్పగలిగారు. యూపీ, మహారాష్ట్ర తర్వాత అత్యధిక ఎంపీలున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లలో గెలిచి సత్తా తగ్గలేదని నిరూపించుకుంది. 2019 ఎన్నికలతో పోల్చితే అదనంగా 7 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 12 సీట్లే గెల్చుకుంది. 2019తో పోల్చితే 6 సీట్లు కోల్పోయింది. జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఎంతో కీలకమని, మోదీని అడ్డుకునే నేతల్లో తాను ఉన్నానన్న సంతృప్తి దీదీకి ఈ ఎన్నికలు మిగిల్చాయి.ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో 3 ఎంపీ స్థానాలను గెల్చుకుంది. అయితే ఈ ఎన్నికల నేర్పింది పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఇద్దరు జైలు కెళితే పార్టీని నడిపే రెండో తరం నేతలు లేని పరిస్థితి. ఆ ప్రభావం పార్టీపై ఎలా ఉందో కేజ్రీవాల్కు నేర్పాయి. అంతా తానై నడిపిస్తే ఏ పరిస్థితి ఎదుర్కోవాల్సివస్తుందో ఈఎన్నికల ఫలితాలు ఓ పాఠం.విషయానికి వస్తే అత్యధిక కాలం ఓ రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిగా రికార్డు కొడదామన్న బీజేడి అధినేత నవీన్ పట్నాయక్ ఈఎన్నికలు గట్టి దెబ్బ తీశాయి. అధికార పీఠాన్ని బీజేపీకి ఒదులుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి. 21 పార్లమెంట్ స్థానాల్లో 20 బీజేపికి ఓటరు కట్టబెట్టారు. 145 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ తొలిసారి 78 స్థానాలు గెలిచి అధికారం చేజిక్కించుకుంది. ప్రజలకు దూరంగా అధికారులతో ప్రభుత్వాన్ని నడపితే.. తమ తీర్పు ఇలా ఉంటుందన్న అనుభవాన్ని ఓటర్ ఈ ఎన్నికల ద్వారా రుచి చూపించారు.తమిళనాడు విషయానికొస్తే బీజేపీకి డోర్ తెరిచేది లేదంటూ తమిళ ఓటరు.. స్టాలిన్ కే విజయాన్ని కట్టబెట్టారు. 39 పార్లమెంట్ సీట్లలో డీఎంకే కూటమినే గెలిపించారు. హిందుత్వ ఎజెండా ఇక్కడ చెల్లదని తమిళ ఓటరు చెప్పకనే చెప్పారు. తన నాయకత్వానికి తిరుగులేదన్న ఆత్మవిశ్వాసం డీఎంకే అధినేత స్టాలిన్కు కట్టబెడితే… అమ్మ లేని పార్టీ అన్నాడీఎంకే నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తే పరిస్థితిని కల్పించాయి.తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు కీలకనేతలకు మాత్రం ఈ ఎన్నికలు విషాదాన్ని నింపాయి. మరో ఇద్దర నేతల్లో ఆనందాన్ని నింపాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు తెలుగు ఓటరు పట్టం కట్టారు. ఏపీలో చంద్రబాబు, పవన్ కూటమి సూపర్ హిట్ కొట్టగా, జగన్ ఈ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యారు. అధికారం శాశ్వతం కాదని, ఆ స్టీరింగ్ ఓటరు చేతిలోనే ఉందని తెలుగు ఓటర్ నిరూపించారు.
=======================