సిరా న్యూస్,వరంగల్ ;
శాసన మండలిలో తమ సభ్యులను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. శాసనమండలిలో మొత్తం 40మంది సభ్యులుండగా వీరిలో 29మంది బీఆర్ఎస్ పార్టీవారే. కాంగ్రెస్కు కేవలం నలుగురు ఎమ్మెల్సీలే ఉన్నారు. ఇప్పుడు హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ కావడంతో గులాబీపార్టీలో గుబులు మొదలైంది. త్వరలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఎలాగైనా గులాబీదళం బలం తగ్గించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ గట్టి కసరత్తు చేస్తోంది.శాసనమండలిలో పలు కీలక బిల్లుల ఆమోదానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుపడే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ వారికి గాలం వేస్తోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్నట్టు సమాచారం. వీరు పార్టీని వీడి కాంగ్రెస్తో జతకట్టేందుకు సిద్దమయ్యారనే టాక్ వినిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ అధిష్ఠానం అలర్ట్ అయింది. ఎవరెవరు పార్టీమారే అవకాశం ఉందో ఆరా తీస్తోంది. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండేవారి నుంచి వివరాలు సేకరిస్తుంది.బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు తమపార్టీతో చేరితే పదవులు,నిధులు ఇస్తామని కాంగ్రెస్ హామీలు ఇస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు ఇచ్చినప్పటికీ మరో కొంతకాలం పదవి ఉండాలంటే పార్టీ మారడం శ్రేయస్కరమని కొందరు ఎమ్మెల్సీలు భావిస్తున్నట్టు టాక్. అందులో భాగంగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు పలువురు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కొందరికి పార్టీ అధినేత కేసీఆర్ ఫోన్ చేస్తే వారినుంచి సరైన సమాధానం రాలేదని.. అలాగని పార్టీలో కొనసాగుతామని కూడా చెప్పలేదు. దీంతో 29మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలలో కనీసం 10మందైనా మిగులుతారా అనే సందేహం కారుపార్టీని ఠారెత్తిస్తోంది.వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న ఆరుగురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్కు అత్యంత సన్నిహితులుగా పేరుగాంచారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమ భవిష్యత్తుకోసం పార్టీ మారేందుకు వీరు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ తీరును, టికెట్ల కేటాయింపును వరంగల్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్సీ బహిరంగంగానే తప్పుబట్టారు. ఆయన నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ కంచుకోటగా మారడంతో పార్టీమారాలని అనుచరగణం ఒత్తిడి చేస్తోంది. మరో ఎమ్మెల్సీపై కూడా అనుచరులు పార్టీ మారాలని ఇలాగే ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్లోకి వస్తే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని రేవంత్కు సన్నిహితుడైన ఎమ్మెల్యే ఒకరు ఆ ఎమ్మెల్సీకి చెప్పినట్టు తెలిసింది. ఈ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీకి కాంగ్రెస్కు చెందిన ఇద్దరు మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన కూడా కాంగ్రెస్లోకి జంప్ చేసే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది.
విస్తరణలో ఐదుగురికి చోటు
స్థానిక సంస్థల ఎన్నికల వేళ కేబినెట్ విస్తరణ దృష్టి సారించారు సీఎం రేవంత్రెడ్డి. ఈ వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్తో మంతనాలు జరిపారు. దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అంతర్గత సమాచారం. తెలంగాణలోని ముఖ్యనేతలు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో తమకున్న సంబందాల ద్వారా లాబీయింగ్ మొదలుపెట్టారు. అంతా అనుకున్నట్లు జరిగితే జులై మొదటివారంలో కేబినెట్ విస్తరణ ఉంచవచ్చని అంటున్నారు.ప్రస్తుతం ముఖ్యమంత్రితోపాటు 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. మరో ఐదారుగురు ఛాన్స్ ఉన్నా, ఈసారి ఐదుగురుకి చోటు కల్పించాలని భావిస్తున్నారట. రేవంత్రెడ్డి కేబినెట్లో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా, కొన్ని జిల్లాలకు అసలు చోటు లేదు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలెవ్వరూ లేరు.ఈసారి ఆయా జిల్లాలకు ఛాన్స్ ఇవ్వాలన్నది అసలు పాయింట్. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలామంది జాయిన్ అయ్యారు.. మరికొందరు రేపోమాపో కాంగ్రెస్లోకి రావాలని భావిస్తున్నారు. తమకు మంత్రివర్గం లో చోటు లేకపోయినా, మిగతా పదవులు ఇవ్వాలని కోరుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ సమాచారం.లోక్సభ ఎన్నికల సందర్భంగా ముదిరాజ్లకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. వారిలో ముక్తల్ నుంచి శ్రీహరికి రావచ్చని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమసాగర్, సుదర్శన్రెడ్డి, మైనార్టీల నుంచి ఒకరు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచి, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దాన్ని భర్తీ చేయాలని భావిస్తున్నారట సీఎం రేవంత్రెడ్డి. కేబినెట్ విస్తరణ తర్వాత నాలుగైదు నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.
======================