టిట్ ఫర్ టాట్.. బూమ్ రాంగ్ అవుతుందా

సిరా న్యూస్,హైదరాబాద్;
రెండు సార్లు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలను కేసీఆర్ విలీనం చేసుకున్నాడు.. అయినా కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేకపోయారు కదా…ఆయన పార్టీ ఎమ్మెల్యేలు మాకెందుకు ?” అని ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీడియా ఇంటర్యూల్లో తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పటికీ కాంగ్రెస్ నేతల ఆలోచనలు టిట్ ఫర్ టాట్ అనే దారిలో ఉన్నాయి. అంటే కేసీఆర్ రెండు సార్లు తమ ఎల్పీల్ని విలీనం చేసుకున్నారు కాబట్టి.. తాము కూడా ఈ సారి బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకోవాలని.. ఆ దిశగా రేవంత్ రాజకీయం చేయాలని కోరుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన తప్పుల్ని తాను చేయకూడదన్నట్లుగా పరిణితితో మాట్లాడారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్‌కు ఇప్పుడు ఉన్న ముఫ్పై ఐదు మంది ఎమ్మెల్యేల్లో కనీసం పదిహేను మందికి అసెంబ్లీ ఎన్నికలుక ముందు కండువా కప్పేందుకు సిద్ధమవుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత .. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని పార్టీలోకి ఆకర్షించారు. అందు కోసం అధికార బలాన్ని ప్రయోగించారు. మనకు అవసరం లేదు కదా ఎందుకు అని.. అని అంటే వారు కాంగ్రెస్ లో ఉంటే.. ఏదో ఒకటి వాగుతూ ఉంటారు.. మన పార్టీలో చేర్చుకుంటే సైలెంట్ గా ఉంటారని సమాధానం చెప్పారని ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ సారి బహిరంగంగానే చెప్పారు. అంటే.. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయకుండా వారిని నిర్వీర్యం చేయడానికి తమ పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించేవారు. దీని వల్ల ఆయన పార్టీ ఎంత నష్టపోయిందో.. ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. పార్టీలో పెద్ద ఎత్తున గ్రూపులు పెరిగిపోయాయి. నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరాటం చేసుకుంటూ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారు. పొటెన్షియల్ లీడర్లు కొంత మందికి టిక్కెట్లు దక్కక కాంగ్రెస్ లో చేరిపోయి విజయం సాధించారు. అంటే కేసీఆర్ చేసిన చేరికల రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం బలహీనం చేయకపోగా..రివర్స్ లో బీఆర్ఎస్‌కే మైనస్ అయ్యాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతలు.. బీజేపీ నేతలు ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో తెలియదని కామెంట్స్ చేశారు. కానీ అది మైండ్ గేమే. ఇప్పుడు రేవంత్ సర్కార్ కు వచ్చిన ముప్పేమీ లేదు. బీజేపీ పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ తో సమానంగా గెల్చుకుంది. కేంద్రంలో మిత్రపక్షాల అండతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ .. కాంగ్రెస్ సర్కార్ జోలికి అసలు రాదు. బీఆర్ఎస్‌కు అసలు అలాంటి అవకాశం కూడా లేదు. అయినా రేవంత్ .. ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు రెడీ అయిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 సీట్లు గెలిచింది. అయితే ఇందులో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. సో సంఖ్య 38కి తగ్గింది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరంతా కాంగ్రెస్‌కు కలిశారు. అంటే ఎమ్మెల్యేల సంఖ్య 68కి చేరింది. బీఆర్ఎస్ కు ఇప్పుడు 35 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. వీరిలో పదిహేను మంది వరకూ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీలో చేరే వారంతా పూర్తిగా అధికారం అనే బెల్లముక్క చుట్టూ చీమలు, ఈగలుగా చేరేందుకు వస్తున్నవారే. ఎందుకంటే వారు ఇప్పటి వరకూ కాంగ్రెస్ ను ఓడించేందుకు పని చేశారు. పార్టీలో పదవులు లేదా ప్రభుత్వంలో నామినేటెడ్ ప దవులు.. ఇంకా ఆర్థిక ప్రయోజనాలు ఆశించి చేరే వారు కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి నేతలే రేవంత్ రెడ్డికి అతి పెద్ద సవాల్ . తెలంగాణ ఎన్నికల్లో ఏటికి ఎదురీది గెలిచారు. ప్రస్తుతం పార్టీలో చేరుతున్న వారంతా కాగ్రెస్ పార్టీని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డిన వాళ్లే. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని నమ్మిన వాళ్లే. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి నేతలు కూడా కారణం. ఇప్పుడు గేట్లు ఎత్తి ఈ సమస్యను తన నెత్తి మీద వేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. పదేళ్లు పార్టీ కోసం కష్టపడిన వారు ఉన్నారు. దశాబ్దం పాటు పార్టీ కోసం కష్టపడిన వారు.. అసలు పార్టీకి భవిష్యత్తే ఉండదన్న భావన వచ్చినప్పటికీ పార్టీని వదిలి పెట్టని వారు ఉన్నారు. వారిలో చాలా మంది గ్రామ, మండల స్థాయిలోనే ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ ఎప్పటికప్పుడు బలంగా ఉందన్న భావన రావడానికి లీడర్లు పోయినా క్యాడర్ పోలేదని అనుకోవడమే. బీఆర్ఎస్ నేతలంతా పోలోమని కాంగ్రెస్ లోకి వస్తే.. మరి వారికి అన్యాయం చేసినట్లే అవుతుంది. అందర్నీ గుర్తిస్తామని రేవంత్ చెబుతున్నారు. కానీ అది మాటల్లో అంత తేలిక కాదు.అయితే బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయవచ్చు అన్న వ్యూహంతోనే చేరికలను ప్రోత్సహిస్తున్నారని అనుకోవచ్చు. కానీ అది రివర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది.త కేసీఆర్‌కు అలాగే అయింది. రేవంత్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *