సిరాన్యూస్, ఖానాపూర్
అధికారులు ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉండాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఖానాపూర్ మండల సర్వసభ్య సమావేశం
అన్ని శాఖల అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, సమస్యలను పరిష్కరించాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడిఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్నారు.శాఖల వారీగా అధికారులు నివేదికలను వెల్లడించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈరిగేషన్, వ్యవసాయం, వైద్యం, విద్య, అనే అంశాలపై ప్రధానంగా సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. మార్కెట్ లో నకిలీ విత్తనాలు రాకుండా కట్టడి చేయాలన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి కాకుండా చూసుకోవాలన్నారు. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో కరెంటు కోతలు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.అధికారులు అభివృద్ధి పనులపై నివేదికలను తమకు సమర్పిస్తే ఆ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామన్నారు. పెండింగ్ బిల్లులు ఉంటే త్వరగా మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్ల వేళల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఖానాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేయడం కోసం మార్నింగ్ వాక్, ఫోన్ ఇన్, పల్లె బాట లాంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.