ప్రమాదాల నివారణకు కవచ్ సంస్థ

 సిరా న్యూస్,ముంబై;
రైలు ప్రమాదాలతో నష్ట నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా జూన్ 17న పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం తర్వాత, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే అధికారులను నిర్మాణాత్మక మిషన్ మోడ్‌లో భాగంగా కవచ్ సిస్టమ్ అమలును వేగవంతం చేయాలని ఆదేశించినట్లు పలు జాతీయ వార్త పత్రికలు ప్రకటించాయి. వచ్చే ఐదేళ్లలో 44,000 కిలోమీటర్ల ట్రాక్‌లో కవచ్ సేఫ్టీ సిస్టమ్‌ను అమలు చేయాలని భారతీయ రైల్వే యోచిస్తోందని రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల క్యాబినెట్ సెక్రటరీకి సైతం తెలియజేసింది. కవచ్ అనేది ఆటోమేటెడ్ రైలు రక్షణ వ్యవస్థ, ఇది ట్రాక్‌పై ప్రమాదాలను నివారించడానికి రూపొందించిన భద్రత వ్యవస్థ. కవచ్ 4.0పై జరిగిన సమీక్షా సమావేశంలో, వైష్ణవ్ అన్ని లోకోమోటివ్‌లను ఈ సిస్టమ్‌తో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం, ముగ్గురు తయారీదారులు కవాచ్ వ్యవస్థను ఉత్పత్తి చేస్తున్నారు.రైల్వే మంత్రిత్వ శాఖ ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో కవచ్ ఇన్‌స్టాలేషన్‌పై కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి అదనంగా మరో 6 వేల కి.మీ.లకు టెండర్లు జారీ చేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రధాన రైల్వే నెట్‌వర్క్‌లు 1980లలో కవచ్ మాదిరిగానే ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ(ఏటీపీ)లకు మారాయి. భారతీయ రైల్వేలు కూడా 2016లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీఏసీఎస్) మొదటి వెర్షన్ ఆమోదంతో ఇదే విధానాన్ని అవలంబించాయి. విజయవంతమైన ట్రయల్స్, 2019లో ఎస్ఐఎల్-4 భద్రతా ధ్రువీకరణను సాధించిన తర్వాత, ఈ వ్యవస్థను 2020లో అధికారికంగా జాతీయ ఏటీపీ వ్యవస్థగా స్వీకరించారు.మూడు భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) రూపొందించిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థ కవచ్. ఇది రైల్వే భద్రతను మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది రైలు వేగాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రమాద సంకేతాలను గుర్తించడంలో రైలు ఆపరేటర్లకు సహాయం చేస్తుంది. సవాలుతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితమైన కార్యకలాపాలను నిర్ధారిస్తుంది. ఇది భద్రతా సమగ్రత స్థాయి-4 (ఎస్ఐఎల్-4) ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన అధునాతన ఎలక్ట్రానిక్ సిస్టమ్.డ్రైవర్ వెంటనే స్పందించకుంటే రైళ్లకు ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేయడం ద్వారా కవచ్ పనిచేస్తుంది. ఇది ట్రాక్ స్థానాలు, రైలు దిశలను గుర్తించడానికి ట్రాక్‌ల వెంట, స్టేషన్ యార్డులలో ఉంచిన ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్‌లను ఉపయోగిస్తుంది. యాక్టివేట్ అయినప్పుడు, సమీపంలోని రైళ్ల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి 5-కిమీ వ్యాసార్థంలో రైళ్లు ఆగుతాయి. ఆన్ బోర్డ్ డిస్‌ప్లే ఆఫ్ సిగ్నల్ యాస్పెక్ట్ (ఓడీడీఎస్ఏ) రైలు ఆపరేటర్‌లను ప్రతికూల దృశ్యమాన పరిస్థితులలో సిగ్నల్‌లను పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా మాన్యువల్ దృశ్య తనిఖీలపై ఆధారపడటం తగ్గుతుంది. 2022లో దీనిని విజయవంతంగా పరీక్షించారు. కవచ్ వ్యవస్థ ద్వారా ఒక లోకోమోటివ్‌ను ముందు నుంచి కేవలం 380 మీటర్ల దూరంలో ఆటోమేటిక్‌గా ఆపడం ద్వారా వెనుకవైపు ఢీకొనడాన్ని నిరోధించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *