– పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ డి.హేమంత్ కుమార్
సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి;
డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రబావాల పై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ డి.హేమంత్ కుమార్ అన్నారు. బుధవారం పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి డాక్టర్ డి.హేమంత్ కుమార్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి సమీకృత జిల్లా కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో అదనపు కలెక్టర్ లు జే.అరుణశ్రీ, జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ, డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ ఆసాంతం అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కునారం రోడ్డు వద్ద అధికారులు, విద్యార్థలు డ్రగ్స్ వినియోగాన్ని వ్యతిరేకిస్తూ మానవహారం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ డి.హేమంత్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా అండ్ సెషన్స్ జడ్జి డాక్టర్ డి.హేమంత్ కుమార్ మాట్లాడుతూ మాధక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులలో, ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. డ్రగ్స్ ను అరికట్టడంలో ప్రభుత్వానికి మనమంతా బాధ్యత గల పౌరులుగా పూర్తి స్థాయిలో సహకారం అందజేయాలని అన్నారు. మనమంతా యూనిఫామ్ వేయని పోలీసు లాగా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అరికట్టడానికి కృషి చేయాలని, డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభవాల గురించి మనం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు వివరించాలని, మనకు తెలిసిన వారిలో ఎవరైనా మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎన్.శ్రీనివాస్, ఏ.సి.పి. క్రిష్ణ, సి.ఐ. క్రిష్ణ, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఆర్. మహిపాల్ రెడ్డి, జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఏ.సురేష్, జిల్లా న్యాయ సేవాధికార, పోలీస్, ఎక్సైజ్, సంబంధిత అధికారులు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.