జగన్ కేరాఫ్ బెంగళూరు ప్యాలెస్

సిరా న్యూస్,అనంతపురం;
వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి.. ఏపీ మాజీ సీఎం. మొన్నటి వరకు తాడేపల్లిలో ఉండేది ఆయన నివాసం. ప్రస్తుతం ఆయన కేరాఫ్‌ అడ్రస్ మాత్రం బెంగళూరులోని యలహంక ప్యాలెస్. అవును.. ఆయన ఆ ప్యాలెస్ దాటి రావడం లేదు.. ఎవ్వరిని కలవడం లేదు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్‌ చెప్పిన మాటలు ఇవి. 2019 ఎన్నికల్లో గెలిచినట్టు 151 సీట్లతో మనం సర్దుకుపోవద్దు. ఈసారి.. అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 175 సీట్లు సాధించాల్సిందే. దీని కోసం ఆయన అనేక మార్పులు చేర్పులు చేశారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చేశారు. కొత్త వారిని చేర్చారు. పాతవారిని మార్చేశారు. మరి ఇంతా చేస్తే ఏం జరిగింది. ప్రజలు జగన్‌నే మార్చేశారు. 175 దేవుడెరుగు.. ఏకంగా 11కు పడిపోయింది సీట్ల సంఖ్య. జగన్‌ ఏం మాట్లాడారో ప్రజలు మర్చిపోయినా.. ఆయనకైతే గుర్తుండి ఉండే ఉంటుంది కదా. నేను ఊహించింది ఏంటి? జరిగింది ఏంటి? అనే డైలమాలో ఉండిపోయారు జగన్. తాడేపల్లి నుంచి మకాం ఫస్ట్ పులివెందులకు షిఫ్ట్ అయ్యింది. ఆ తర్వాత అటు నుంచి అటే బెంగళూరుకు వెళ్లిపోయారు. నిజానికి మొదట అందరూ అనుకున్నది ఏంటంటే.. జగన్‌పై ఇక్కడైతే నిఘా ఉంటుంది. అదే బెంగళూరులో అయితే అలాంటి ఇబ్బందులు ఉండవు. అక్కడే జగన్ కీలక నేతలతో కలిసి వ్యూహాలు రచిస్తారని అంతా ఊహించారు. కానీ.. అక్కడ ఇది కూడా జరగడం లేదు. జగన్‌తో నేతలు కూడా భేటీ అవ్వడం లేదు. కాబట్టి వ్యూహా రచన ఏం జరగడం లేదు. మరి బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో జగన్ ఏం చేస్తున్నారు?జగన్‌ బెంగళూరుకు వెళ్లడానికి రెండు కారణాలు ఉండి ఉండాలి. ఒకటి.. ఓటమి తర్వాత ఎవ్వరికి ముఖం చూపించుకునే పరిస్థితి లేకపోవడం. రెండవది.. ఐదేళ్ల పాటు సీఎంగా తెగ కష్టపడ్డాను కాబట్టి.. మనసుకు, శరీరానికి కాస్త రెస్ట్ కావాలని కోరుకోవడం. ఈ రెండు కారణాలలో ఏదో ఒక కారణంతోనే ఆయన బెంగళూరుకు షిఫ్ట్ అయ్యి ఉండాలి. కానీ రెస్ట్ కోసమే ఆయన బెంగళూరుకు వెళ్లే చాన్స్‌ అయితే లేదు. ఎందుకంటే ఎన్నికలు ముగియనగానే ఆయన లండన్ వెళ్లారు. కుటుంబంతో సహా కొన్ని రోజుల పాటు ఆయన వివిధ దేశాలను చుట్టి వచ్చారు. చాలా రిలాక్సేషన్‌ తర్వాతే ఆయన తిరిగి ఇండియాకు వచ్చారు. ఆయన మళ్లీ రెస్ట్ కోసమే బెంగళూరుకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. అయితే జగన్ ఓటమిని తట్టుకోలేకే బెంగళూరుకు తన కేరాఫ్‌ అడ్రస్‌ను మార్చేశారని తెలుస్తుంది.
జగన్‌కు తాడేపల్లిలో ఓ ఇల్లు ఉంది. ఆ తర్వాత సొంత గడ్డ పులివెందులలో మరో ఇల్లు ఉంది. కానీ ఈ రెండింటిలో దేనిని చూస్ చేసుకోలేకపోయారు. తాడేపల్లి అనేది అమరావతిలో ఉన్న ప్రాంతం. అక్కడ జగన్‌ అంటే నచ్చేవారు, మెచ్చేవారు ఎవరూ లేరు. అధికారంలో ఉన్నప్పుడు తన ఇంటి పరిసరాలవైపు ఎవ్వరినీ రానివ్వలేదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అక్కడికి ఎవ్వరూ వచ్చినా.. ఏ నేతతో మాట్లాడినా.. వారి మొఖాల్లో 11 నెంబర్ కనిపిస్తుంది.అంతేకాదు.. ఎప్పుడు ఏ వైపు నుంచి నిరసన వ్యక్తమవుతుందో తెలియని పరిస్థితి. అందుకే పులివెందులలో పర్యటన పెట్టుకున్నారు. అక్కడ కూడా అదే పరిస్థితి.వైసీపీకి మంచి పట్టున్న ప్రాంతం రాయలసీమ అనే ముద్ర ఉండేది. ఈ ఎన్నికల దెబ్బకు ఆ ముద్ర కూడా చెరిగిపోయింది. పులివెందులలో తనను కలిసే నేతలు, అనుచరులను చూస్తుంటే ఆయనకు ఓటమి బాధ మరింత ఎక్కువవుతున్నట్టు తెలుస్తుంది. అందుకే ఒంటరిగా ఉండేందుకే ఆయన యలహంక ప్యాలెస్‌కు వెళ్లారని తెలుస్తుంది. అక్కడైతేనే తన మనసుకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది. అక్కడైతేనే ఎవ్వరూ రారు.. ప్రభుత్వ నిఘా ఉండదు. నిరసనల బాధ లేదు.. పరామర్శల గోల లేదు. మొత్తానికి తన దారుణ ఓటమిని మర్చిపోయేందుకు టైమ్ దొరుకుతుంది. అసలు ఈ ఎన్నికలే జరగలేదు.. ఆ ఎన్నికల్లో నేను పోటీ చేయలేదు. 11 సీట్లు రాలేదు.. అనే ఫీలింగ్‌ కోసమే జగన్‌ యలహంక ప్యాలెస్‌కు చేరినట్టు అర్థమవుతుంది.
=====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *