కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత

సిరా న్యూస్,హైదరాబాద్‌;
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్‌ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాసలో చేరిన డీఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్‌ ప్రస్తుతం బీజేపీ తరఫున నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. 1948 సెప్టెంబర్ 27న జన్మించిన డీఎస్‌ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి తొలి సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్ లాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. 2004లో తెరాసతో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్‌తో కలిసి పనిచేశారు.
సోనియా గాంధీకి విధేయునిగా

డీఎస్‌కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు ఉంది. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. 2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండో సారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెరాసలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు తెరాస రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో భారాసతో విభేదించి కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.
తండ్రి, గురువు అన్నీ మా నాన్నే.. : అర్వింద్‌
‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు.
నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే.
పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నాలోనే ఉంటావు’’ అని డీఎస్‌ కుమారుడు అర్వింద్‌ కన్నీటి పర్యంతమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *