ఇకపై నెలనెలా 1వ తేదీన ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లాలో 2,35,477 మందికి రూ.160.53 కోట్ల పింఛను సొమ్ము పంపిణీ
జిల్లా కలెక్టర్ సృజన తో కలసి పింఛన్ సొమ్ము అందజేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు
 సిరా న్యూస్,విజయవాడ;
ఇకపై నెలనెలా 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తో కలసి, ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు సోమవారం ఉదయం పెంచిన పింఛన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. ముందుగా కలెక్టర్ సృజన ని ఘనంగా స్వాగతించి, శాలువా కప్పి సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్ ను ఇంటి వద్దనే అందించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామన్నారు.
ఏప్రిల్ నెల నుండి పెంచిన పింఛన్ మొత్తాన్ని అందించనున్న నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి నెలకు రూ.1000లు చొప్పున మొత్తం రూ.3వేలు, జూలై నెలకు గాను రూ.4వేలు మొత్తం కలిపి రూ.7 వేలు అందజేస్తున్నట్లు వివరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో పూర్తి పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 2,35,477 పెన్షన్ లబ్దిదారులకు రూ.160.53 కోట్ల రూపాయల నగదును పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పింఛన్ సొమ్ము సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ బొమ్మసాని సుబ్బారావు , మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహన్రావు (గాంధీ) , బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు , అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
==========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *