భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరిస్తాం

సిరా న్యూస్;

ఏఐటియుసి నాయకులకు కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ!

భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ఫైలు పైనే తన తొలి సంతకం చేస్తానని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ భవననిర్మాణ కార్మికసంఘం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ బృందం శనివారం రాష్ట్ర కార్మిక శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ ను రామచంద్రపురం లో కలసి సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందచేసింది.

దానికి మంత్రి సుభాష్ సానుకూలంగా స్పందించి తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును క్రియాశీలం చేసి సభ్యుల పెండింగు క్లెయిములను పరిష్కరించి నిధులను మంజూరు చేయాలని , యాభై సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని మంత్రికి అందచేసిన వినతిపత్రంలో కోరారు.
మంత్రి సుభాష్ స్పందిస్తూ తన మొదటి సంతకం సంక్షేమబోర్డు ఫైలు పైనే పెడతానని హామీ ఇచ్చారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం 2009 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, 2019 సంవత్సరం వరకు క్లెయిములకు నిధులు మంజూరు చేసేవారని, 2019 తర్వాత గత ప్రభుత్వం నిధులను నిలిపివేసి , జిఓ నెంబర్ 17 ను తెచ్చి కార్మికులకు అన్యాయం చేసిందని వివరించారు.

సభ్యత్వం చెల్లించి అర్హత పొందిన కార్మికులకు గతంలో వెల్ఫేర్ బోర్డు ద్వారా పలు ఆర్థిక సహాయాలు అందేవని, జగన్ ప్రభుత్వం వాటిని నిలిపి వేసిందని వారు మంత్రికి వివరించారు.
ప్రైవేటు భవన నిర్మాతల నుండి, ప్రభుత్వ నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్ల నుండి సెస్సు వసూలు చేసి వెల్ఫేర్ బోర్డుకు జమ చేస్తారని, ఆ నిధుల నుండి కార్మికుల క్లేయిములు ఇస్తారని వారు పేర్కొన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన నాటికి వెల్ఫేర్ బోర్డులో సుమారు 22 లక్షల మంది కార్మికులు సభ్యత్వం కలిగి వున్నారని. బోర్డులో నిల్వ ఉన్న వేల కోట్ల రూపాయల నిధులను గత రాష్ట్ర ప్రభుత్వం తమ ఇతర పథకాలకు దారి మళ్లించడంతో రాష్ట్రంలో దాదాపు 42 వేల క్లెయిములు పెండింగులో ఉండి పోయాయని , వెల్ఫేర్ బోర్డులో కొత్త సభ్యుల నమోదును ప్రభుత్వం నిలిపి వేయడంతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న మరో ముప్పై లక్షలమంది కార్మికులు బోర్డులో చేరలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రికి యూనియన్ నాయకులు వివరించారు.
కార్మికులకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం జరిగిందని, ఇప్పుడు నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని , పెండింగు క్లెయిములను పరిష్కరించాలని , గత ప్రభుత్వం దారి మళ్ళించిన నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలని , ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చి కార్మికులను ఆదుకోవాలని వారు మంత్రిని కోరారు.
మంత్రి సుభాష్ స్పందిస్తూ తమ కూటమి అధికారంలోకి రావడంలో భవన నిర్మాణ కార్మికులు కీలక పాత్ర పోషించారని, వారికి పూర్తిగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు
========================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *