సిరా న్యూస్,అదిలాబాద్;
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో పద్దతిగా ప్రజలిచ్చిన తీర్పుతో నలుగురు బీజేపీ, నలుగురు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ పది మందిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు స్థానికులే అయినా ఆ ముగ్గురు మాత్రం పక్కా నాన్ లోకల్ అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్యేలుగా గెలిచి ఏడు నెలలైనా స్థానికంగా అందుబాటులో ఉన్నది జస్ట్ పదంటే పది రోజులు కూడా లేరన్నదీ ఆ నియోజక వర్గ ప్రజల మాట. ఎన్నికల సమయంలో తప్పితే మా నేతను చూసింది అంతంత మాత్రమే అన్నది సొంత పార్టీ క్యాడరే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. నియోజక వర్గ అభివృద్ది కోసం కలుద్దాం అంటే స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని, అత్యవసరం అయితే రాజధాని హైదరాబాద్కు పరుగులు తీయాల్సి వస్తుందని చెప్తున్నారట ఆ నియోజక వర్గ జనం. తీరా అక్కడికి వెళ్లినా పని అవుతుందన్న నమ్మకం ఉండటం లేదని, అంతా పీఏల రాజ్యమే సాగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఎన్నికల సమయంలో పక్కా లోకల్ అని బాస చేసి.. గెలిచాక కంటికి కూడా కనిపించకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట నియోజక వర్గ జనంఈ లిస్ట్ లో ఉమ్మడి ఆదిలాబాద్ నుండి గెలిచిన చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం బ్రదర్స్ వినోద్, వివేక్ టాప్ ఫ్లేస్ లో ఉండగా, నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి సైతం నేనేమైనా తక్కువనా అంటూ వీకెండ్ ఎమ్మెల్యేలు అన్న ముద్ర వేసుకున్నారట. వీరంతా ఎమ్మెల్యేలుగా గెలిచాక నియోజక వర్గంలో కనిపించింది లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో మాత్రమేనట. ఎన్నికలు ముగిశాక కంటికి బంగారం అయిపోయారని చెప్తున్నారు ఆ నియోజక వర్గాల జనం. ప్రజలకు కాదు కదా కనీసం పార్టీ క్యాడర్ కు కూడా అందుబాటులో ఉండటం లేదని ఆయా నేతల పార్టీ కార్యకర్తల మాట. ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ , వివేక్ లు అయితే స్థానికంగా ఉంటాం. ఇక్కడే ఇల్లు కట్టుకుంటాం అని ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ రాసిచ్చి మరీ బాస చేసి, గెలిచిన వెంటనే ఒట్టు తీసి గట్టు మీద పెట్టారన్న ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయట. ఈ ఇద్దరు ఎమ్మెల్యే లను కలువాలంటే మూడంచెల పీఏల భద్రతను దాటాలని, గోడు వెళ్లబోసుకోవాలనుకున్నా పీఏలకే విన్నవించుకోవాలని, అదృష్టం బాగుండి పీఏలు సదరు ఎమ్మెల్యేలకు సమాచారం చేర వేస్తే సరి లేదంటే వీకెండ్ వరకు ఎదురు చూడకతప్పదని వాపోతున్నారట ఆయా నియోజక వర్గ ప్రజానికం. ఇందు కోసమేనా మిమ్మల్ని గెలిపించుకున్నది అంటూ సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా గడ్డం బ్రదర్స్ ను ఘాటుగానే విమర్శిస్తున్నారట.అటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ సైతం వీకెండ్ ఎమ్మెల్యేగా ముద్ర పడ్డా.. నియోజక వర్గానికి వచ్చిన సమయంలో మాత్రం క్యాడర్ కంటే ఎక్కువగా జనంతో మమేకమవుతూ అభివృద్దిపై ఫోకస్ పెట్టడంతో గెస్ట్ ఎమ్మెల్యే ముద్రను చెరిపేసుకోగలగారట. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లో మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో.. ఆదిలాబాద్, ముథోల్, బోథ్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిపాబాద్ ఎమ్మెల్యేలు పక్కా లోకల్ అంటూ అభివృద్ది కార్యక్రమాల్లో దూసుకుపోతుండంతో, కనీసం వారిని చూసైనా మా ఎమ్మెల్యేలు మారితే అదే పది వేలు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట ఆ మూడు నియోజక వర్గాల జనం. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బీజేపీఎల్పీ బాద్యతలు చేపట్టాక బిజీబిజీగా మారారని, అయితే గడ్డం వివేక్ వెంకటస్వామి, వినోద్ లు మాత్రం పదవుల కోసం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారని ఆరోపిస్తున్నారట సొంత నియోజక వర్గ నేతలు. నిన్నటి వరకు కొడుకు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసిన గడ్డం బ్రదర్స్.. తీరా ఎంపిీ ఎన్నికలు ముగియడంతో మంత్రి పదవి సాధించుకునేందుకు బిజీ అయ్యారని, ఇంకా నియోజకవర్గాన్ని ఎప్పుడు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నారట.ఒకవేళ మంత్రి పదవి దక్కితే ఈ వీకెండ్ పాలన కూడా హైదరాబాద్ నుండే సాగుతుందేమనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారట చెన్నూర్, బెల్లంపల్లి నియోజక వర్గ జనం. ఇప్పటికే మా నేతలను కలవాలంటే అయితే హైదరాబాద్ లేదంటే, ఢిల్లీ బాట పట్టాల్సి వస్తుందని, అక్కడైనా కలుస్తారని ఆశపడితే పొరపాటేనని చెప్పుకుంటున్నారంట గడ్డం బ్రదర్స్ నియోజక వర్గ జనం. చెన్నూర్ నియోజక వర్గ జనం అయితే గతంలో నాన్ లోకల్ లీడర్ ను గెలిపించుకుని ముప్పు తిప్పలు పడ్డామని, ఇప్పుడు అదే సీన్ రిఫీట్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక మా నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రులైతే కనీసం కంటికి అయినా కనిపిస్తారో లేదో అని చెవులుకొరుక్కుంటున్నారంట గడ్డం బ్రదర్స్ అభిమాన ఘనం. చూడాలి మరీ పదవుల పందెరంలో బిజీ అయినా ఆ ముగ్గురు వీకెండ్ ఎమ్మెల్యేలు ఇకనైనా నియోజక వర్గం పై ఫోకస్ పెడ్తారో లేక మేము పక్కా గెస్ట్ ఎమ్మెల్యేలమే అని ముద్ర కంటిన్యూ చేసుకుంటారో చూడాలి..!
========================