సిరాన్యూస్, బోథ్
శ్రీధర్ రావ్ దేశ్ పాండే రాసిన “బొంతల ముచ్చట్లు” పుస్తక ఆవిష్కరణ
సాగునీటి శాఖ విశ్రాంత సూపరింటెండెంట్ ,ఇంజనీర్, 2018 నుండి 2023 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారి గా విధులు నిర్వర్తించిన శ్రీధర్ రావ్ దేశ్ పాండే రాసిన “బొంతల ముచ్చట్లు” అనే పుస్తకాన్ని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ఆవిష్కరించారు. బోథ్ ప్రాంత భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ,ఆర్థికఅంశాలు, ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలతో పాటు బాల్య జీవిత విశేషాలతో “బొంతల ముచ్చట్లు” అనే పుస్తకాన్ని గురువారం బోథ్ ప్రభుత్వ పాఠశాల, గ్రంథాలయం, పెద్ద వాగు వారధిల వద్ద తన చిన్ననాటి గురువులు అంబాదాస్, నందయ్య, దేవన్న ,మిత్రులు, 1978 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు రమేష్ బాబు, నర్సయ్య, సదానందం, అరవింద్, రావుల శంకర్, మురళీ, ముస్తాప, సురేష్ వైద్య, భాస్కర్ తదితరుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోథ్ ప్రాంత సమున్నత సాంస్కృతిక వారసత్వాన్ని, బోథ్ ప్రాంత సౌందర్య భరితమైన పరిసరాలను, కొండలు, చెట్లు,గుట్టలు, సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, ఈ ప్రాంత ప్రజల జీవన స్థితి గతులు, ఆచార వ్యవహారాలను భావి తరాలకు తెలియజేయాలనే సంకల్పంతో తన అనుభవాలను రంగరించి ఈ పుస్తకాన్ని వ్రసానని అన్నారు. పుస్తక రచయిత తానే అయినప్పటికీ ఇది సమిష్టి అనుభవాలకు అక్షర రూపమని అన్నారు. పుస్తక రచన సమయంలో సమాచారాన్ని, పోటోలను అందించిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. బోథ్ ప్రాంత విశేషాలు ఇంకా చాలా కలవని రానున్న రోజుల్లో మరో పుస్తక రూపంలో అందివ్వడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు.