సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. చలి విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వారు అంచనా వేశారు.ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఎలాంటి వాతావరణ హెచ్చరికలను జారీ చేయలేదు. హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 16 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో తూర్పు దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 16.3 డిగ్రీలుగా నమోదైంది. 74 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, వాయువ్య దిశల్లో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయని చెప్పారు.ఈ వాతావరణ పరిస్థితుల వల్ల.. ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో ఈ రోజు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.