సిరా న్యూస్, సైదాపూర్:
ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలి: సీపీఎం జిల్లా సభ్యుడు వెలిమారెడ్డి రాజిరెడ్డి
* తహసీల్దార్ కు వినతిపత్రం అందజేత
ప్రభుత్వ హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వెలిమారెడ్డి రాజిరెడ్డి అన్నారు. మంగళవారం సైదాపూర్ మండలం సీపీఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా సమస్యలపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తహసీల్దార్ మంజులకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు వెలిమారెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఏ ఒక్క పథకం పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులైన ఇప్పటివరకు రైతు భరోసా పథకం కింద 7500 ఇవ్వలేదన్నారు. వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు, కవులకు నేరుగా వారి అకౌంట్లో 15000 రూపాయలు ఇవ్వాలని కోరారు. కవులు రైతులకు గుర్తింపు కార్డులతో పాటు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని కోరారు . ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, స్థలము లేని ప్రతి పేద వారికి 200 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు డబ్బులు ఇవ్వాలన్నారు. నిరుద్యోగ భృతి ద్వారా యువకులకు 3116 రూపాయలు, ప్రతి సంవత్సరం జాబ్ కార్డు క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 11 సంవత్సరాల నుండి ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు . ప్రతి రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, రైతు పండించిన ప్రతి పంటకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని అన్నారు. ఆన్లైన్ ఇబ్బందుల గృహజ్యోతి పథకం కింద అందరికీ అమలు కావడం లేదని దానిని వెంటనే అమలు చేసి ధరణి భూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండేటి వాసుదేవ్ , మండల సభ్యులు ఎండీ హుస్సేన్, కె. నరేష్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు .