సిరాన్యూస్,తలమడుగు
సుంకిడి పాఠశాలను సందర్శించిన డీఈవో ప్రణీత
* తరగతి గదికి మరమ్మతు చేయించాలని ఎంఈఓకు ఆదేశం
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారిని టి. ప్రణీత సందర్శించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలలో శిథిలావస్థకు చేరుకొని పెచ్చులూడుతున్న తరగతి గదులను పరిశీలించి వాటిని తక్షణమే రిపేర్లు చేయించాలని మండల విద్యాశాఖ అధికారి యు. నారాయణను చరవాణిలో ఆదేశించారు. మన ఊరు మనబడి లో భాగంగా ప్రాథమిక పాఠశాల లో నిర్మించబడ్డ నాలుగు గదులను వర్షాకాలం పూర్తయ్యేంతవరకు నాలుగు నెలలపాటు ఉన్నత పాఠశాల తరగతుల బోధన కోసం వాడుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు తాను పాఠశాలను సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎనిమిది, తొమ్మిది, 10వ తరగతి విద్యార్థులతో తరగతి గదిలోకి వెళ్లి కష్టపడి చదవాలని సూచించారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థులతో గణితం లెక్కలు చేయించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు గజానన్, వై. రామ్ రెడ్డి, సుకుమార్ పేట్కులే, శ్రీనివాస్ రెడ్డి, సుజాత, నాందేవ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ తదితరులు ఉన్నారు.