సిరాన్యూస్, భీమదేవరపల్లి:
ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి శ్రీనివాస రావు
* ఆయిల్ ఫాం తోటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు
ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం భీమదేవరపల్లి మండలంలోని ములుకనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటి లిమిటెడ్ సంఘ ఆవరణలో సంఘ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అధ్యక్షతన ఆయిల్ ఫాం తోటల సాగుపై రైతులకు అవగాహణ సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి శ్రీనివాస రావు మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ జిల్లాలో 7500 ఎకరాలలో ఫాం ఆయిల్ తోటల్ సాగు అవుతున్నాయని తెలిపారు. ఫాం ఆయిల్ సాగు చేసే రైతులు మద్దతు ధర కోసం ఎదురుచూస్తున్నారు అన్నారు. టన్నకు రూ.15,000/-లు మద్దతు ధర అందించాలని కేంద్ర ప్రభుత్వంపై వివిద రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకువస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఫాం ఆయిల్ ధర టన్నుకు రూ.13,000/-వరకు ఉంది అని అన్నారు. భవిష్యత్తులో ఫాం ఆయిల్ తోటలు రైతులకు భరోసా గా మారుతాయన్నారు. అనంతరం కె.యన్ బయోసైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కుశాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి 500 ఎకరాలకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఫాం ఆయిల్ గెలల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భూమిని కేటాయిస్తే ఈ ప్రాంతంలో ఫాం ఆయిల్ ఫ్యాక్టరిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు త్వరలోనే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిదులతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. జైన్ కంపెని జనరల్ మేనేజర్ స్టేట్ టెక్నికల్ హెడ్ యస్. భవాని ప్రసాద్ మాట్లాడుతూ రైతులు ఫాం ఆయిల్ తోటలకు తీసుకోవలసిన యాజమాన్య పద్దతులు, డ్రిప్పు ద్వారా ఎరువులు పంపే విధానాన్ని రైతులకు వివరించారు. అనంతరం ఇప్కో ఫీల్డ్ ఆఫీసర్, హనుమకొండ జె. అక్షయ్ రెడ్డి ఇప్కో కంపెని వారు ములుకనూరు సంఘానికి ఇచ్చిన రెండు డ్రోన్ల పని తీరు గూర్చి వివరించారు. వాటిని సంఘ సభ్యులకు సంఘం ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచామని, వాటిని వినియోగించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఉద్యానవన శాఖ అధికారిణి మానస, మండల వ్యవసాయ అధికారి యం.డి అప్జల్ పాష, సంఘ జనరల్ మేనేజర్ యం. రాం రెడ్డి, సంఘ కార్యవర్గ సభ్యులు, సంఘ వ్యవసాయ అధికారులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.